అగ్నివీరులకు కేంద్రం కొత్త ఆఫర్లు-ఇక అన్ని రక్షణశాఖ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ తాజా పరిస్ధితిని చర్చించేందుకు త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. అగ్నివీరుల నాలుగేళ్ల ఉద్యోగ పరిధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో వారికి మరిన్ని ఆఫర్లు ఇచ్చారు.
అగ్నివీరులకు రక్షణశాఖ పరిధిలో ఉన్న అన్ని ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇవాళ త్రివిధ దళాధిపతులతో సమావేశమైన రాజ్ నాథ్.. అగ్నివీరులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఈ భేటీలో త్రివిధ దళాధిపతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తెలుసుకున్న రాజ్ నాథ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇందులో అగ్నిపథ్ ద్వారా ఎంపికై నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆ తర్వాత రక్షణశాఖలోని 16 సంస్ధల్లో 10 శాతం రిజర్వేషన్ తో అవకాశాలు కల్పిస్తామన్నారు.

కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఇకపై కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటు రక్షణశాఖ పరిధిలోఉన్న 16 సంస్ధల్లోనూ అగ్నివీరులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనతో అగ్నిపథ్ పై జరుగుతున్న ఆందోళనలు సద్దుమణుగుతాయని అంచనా వేస్తున్నారు. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో కేంద్రం ఇవాళ ప్రకటించిన ఆఫర్ల ప్రభావం ఎంత మేర ఉండబోతోందన్నది త్వరలో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications