ఏపీకి కేంద్రం మళ్లీ మొండిచేయి, అందుకే: తెలంగాణకు రూ.450 కోట్లు విడుదల
హైదరాబాద్/అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. అదే సమయంలో తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం గత ఆరు నెలలుగా నిధులు విడుదల చేయలేదు.
ఇదీ మన మీడియా, సీట్ల సర్వే 'ఈనాడు'కు కనిపించదు: అన్నీ చెప్పి దుమ్మెత్తిపోసిన జగన్
తెలంగాణకు నిధులు విడుదల
తెలంగాణలోని 9, ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలకు వెనుకబడిన జిల్లాల కింద నిధులు రావాలి. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రావాల్సి ఉంది. ఆరు నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలకు నిధులు రావాల్సి ఉంది. కానీ రాలేదు. ఇందులో భాగంగా తెలంగాణకు తాజాగా నిధులు విడుదలయ్యాయి. ఏపీకి మాత్రం మొండి చేయి చూపింది.
ఏపీకి ఇచ్చిన నిధులు గతంలో వెనక్కి
ఈ ఏడాది మార్చి నెలలో ఏపీలోని ఏడు జిల్లాలకు విడుదల చేసిన రూ.350 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వీటిని వెనక్కి తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యూసీలు, ఖర్చుల వివరాలు పంపించింది. కేంద్రం అడిగిన తర్వాత పంపించింది.
తెలంగాణ 9 జిల్లాలకు రూ.450 కోట్లు
యూసీలు, ఖర్చులు సమర్పించి నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాలేదు. యూసీలు ఆలస్యంగా ఇచ్చినందువల్ల వచ్చేసారి రెండు కలిపి లేదా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలోను నిధులు పెండింగులో ఉన్నాయి. తెలంగాణకు చెందిన 9 జిల్లాలకు గాను రూ.450 కోట్లు నిధులు రావాల్సి ఉంది. వాటిని వారం క్రితం కేంద్రం విడుదల చేసింది.
ఉత్తర్వులు జారీ
ఈ మేరకు కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని చెప్పారు. ఏపీ యూసీలు ఆలస్యంగా ఇచ్చినందువల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన జిల్లాలకు గాను ఏటా తెలంగాణకు రూ.450 కోట్లు, ఏపీకి రూ.350 కోట్లు చెల్లిస్తోన్న కేంద్రం నుంచి ఈ ఏడాదికి గాను ఏపీకి మాత్రం రావాల్సి ఉంది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలోని పాత తొమ్మిది జిల్లాలకు నిధులు వస్తున్నాయి.