మాస్కులు, శానిటైజర్ల ధరలకు రెక్కలు!: కేంద్రం తాజా నిర్ణయమే కారణం!!
న్యూఢిల్లీ: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ మాస్కులు, శానిటైజర్లూ అత్యవసర జాబితాలో ఉండగా.. వాటిని కేంద్రం ఆ జాబితా నుంచి తొలగించింది. దీంతో వాటి ధరలు త్వరలోనే పెరిగే అవకాశం ఉంది.

మాస్కులు, శానిటైజర్ల ధరలు పెరిగే అవకాశం
ఇప్పటి వరకూ అత్యవసర జాబితాలో ఉన్నాయి కాబట్టి.. వాటి ధరలను భారీగా పెంచడానికి వీల్లేకుండా ఉండేది. అయితే, ఇప్పుడు కేంద్రం అత్యవసర జాబితా నుంచి మాస్కులు, శానిటైజర్లను తొలగించడంతో వాటి ధరలను ఉత్పత్తి సంస్థలు అమాంతం పెంచే అవకాశం ఉంది.

కేంద్ర నిర్ణయంపై విమర్శలు..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో నిత్యావసరంగా ఉపయోగిస్తున్న మాస్కులు, శానిటైజర్లను అత్యవసర జాబితా నుంచి తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కరోనా ముందు కాలంలో ఇండియాలో మాస్కులు, శానిటైజర్లు ఎక్కువగా వాడకం అనేది లేదు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్సలు చేసే సమయంలోనే వాడేవారు.

ఇలాంటి పరిస్థితుల్లోనా..?
అయితే, కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మాస్కులు, శానిటైజర్ల ఉపయోగం అనేది ప్రజలకు తప్పనిసరిగా మారింది. దీంతో సామాన్య ప్రజలందరూ రూ. 10 మాస్కులనే ఎక్కువగా వాడుతున్నారు. కొందరు చేతిరుమాలును, కర్చీఫ్లను వాడుకుంటున్నారు. ఇక శానిటైజర్లు రూ. 50 నుంచి రూ. 300 వరకు ఉంటున్నాయి. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలంటే మాస్కులు, శానిటైజర్లు వాడకతప్పని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు వాటిని కొంటూనే ఉన్నారు. అవి కూడా ప్రజలకు నిత్యావసరంగా మారాయి.

కరోనా కేసులు
ప్రభుత్వాలు కూడా మాస్కులు పెట్టుకోకుంటూ రూ. 500-1000 జరిమానా విధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర నిర్ణయం సామాన్యునికి భారమేనని చెప్పవచ్చు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో 7,21,344 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,60,835 యాక్టివ్ కేసులున్నాయి. 4,40,229 మంది కోలుకున్నారు. 20,184 మంది కరోనాతో మృతి చెందారు.












Click it and Unblock the Notifications