కరోనాపై కేంద్రం ఆసక్తికర గణాంకాలు- సగానికి పైగా బాధితులు వీరే- మృతుల్లో అత్యధికం వృద్ధులే..
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని రాష్ట్ర్లాల నుంచి సేకరిస్తూ విశ్లేషణ చేస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా పలు ఆసక్తికర వివరాలను వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటున్న వేళ.. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంలో కరోనా బారిన పడుతున్న వారు ఎవరు, అలాగే మృతుల్లో ఎవరు ఎక్కువగా ఉంటున్నారనే అంశాలపై కేంద్రం తన తాజా విశ్లేషణలో పలు ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.
కరోనా బాధితుల్లో సగానికి పైగా వీరే..
దేశంలో కరోనా కేసుల సంఖ్య 37 లక్షలు దాటిపోయింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 29 లక్షలుగా ఉంది. రికవరీ శాతం కూడా 76.98గా నమోదవుతోంది. అయితే తాజాగా కరోనా కేసులను విశ్లేషించిన కేంద్ర ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే దేశంలో 54 శాతం కేసులో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారేనని తేలింది. అంటే అటు మైనర్లు కానీ, ఇటు వృద్ధులకు కానీ వైరస్ సోకుతున్న శాతం 46 శాతంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే యువజనులకే కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు తెలుస్తోంది. పిల్లలు ఇళ్లకే పరిమితం కావడం కూడా ఈ గణాంకాలకు కారణమై ఉండొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
మృతుల్లో వృద్ధుల శాతమే ఎక్కువ...
అలాగే కరోనా కేసుల్లో చనిపోతున్న వారి సంఖ్యను విశ్లేషించినప్పుడు 51 శాతం మంది వృద్ధులే ఉన్నట్లు నిర్దారణ అయింది. ముఖ్యంగా వీరంతా 60 సంవత్సరాలు దాటిన వారే అని ఆరోగ్యశాఖ చెబుతోంది. కరోనా బారిన పడిన వృద్దుల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో వారు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వృద్దుల్లో దాదాపుగా ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. దీంతో కేంద్రం తన తాజా విశ్లేషణలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. అంటే కరోనా వైరస్ సోకిన వారిలో వృద్ధులు ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైరస్ ప్రభావం వీరిపై అధికంగా ఉంటున్నట్లు తాజా విశ్లేషణలు చెబుతున్నాయి.
మాస్కులతో కరోనా దూరమవుతోందా ?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కారణంగా జనం మాస్కులు ధరించే తిరుగుతున్నారు. అయితే చాలా చోట్ల ఇంకా మాస్కులను పట్టించుకోకుండా తిరిగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. పలుచోట్ల పోలీసులు మాస్కులు ధరించకపోతే కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడం కూడా చేస్తున్నారు. అయితే తాజాగా వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూషన్ నివేదిక ప్రకారం కేవలం భారత్లోనే డిసెంబర్ నాటికి మాస్కులు, ఇతర కోవిడ్ నిబందనలు పాటించడం వల్ల 2 లక్షల మరణాలు నివారించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కేంద్రం ఇప్పుడు కోవిడ్ నిబంధనల అమలు విషయంలో రాజీ పడొద్దని రాష్ట్రాలకు సూచిస్తోంది.