యుద్ధ విమానాల కోసం కేంద్రం భారీ ఆర్డర్..! ఏకంగా రూ.62370 కోట్లతో..!
ఆపరేషన్ సింధూర్ లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో రాబోయే పదేళ్లలో దేశ రక్షణ కోసం కేంద్రం తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థల సరఫరా కోసం ఒప్పందాలు చేసుకుంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు తేలిక పాటి యుద్ధ విమానాల సరఫరా కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో మరో కీలక ఒప్పందం చేసుకుంది.
రక్షణశాఖ ఇవాళ 97 తేలికపాటి యుద్ధవిమానాలు (తేజస్ ఎంకే1ఏ)ల సరఫరా కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రూ.62370 కోట్ల భారీ ఒప్పందం చేసుకుంది. ఇందులో 68 ఫైటర్ జెట్లతో పాటు 29 రెండు సీట్ల విమానాలు కూడా ఉన్నాయి. 2027-28 మధ్య వీటి పంపిణీని హెచ్ఏఎల్ ప్రారంభిస్తుంది. ఆరేళ్లలో మొత్తం 97 ఎయిర్ క్రాఫ్ట్ లను రక్షణశాఖకు పంపిణీ చేస్తుంది. ఈ విమానాలకు 64 శాతం దేశీయంగా తయారైన పరికరాల్ని వాడబోతోంది.

ఆత్మనిర్భర్ కార్యక్రమానికి ఊతమిచ్చేలా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ల్లో దేశీయంగా తయారైన ఉత్తమ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ యారే రాడార్, స్వయం రక్ష కవచ్, కంట్రోల్ సర్పేస్ యాక్టివేటర్స్ ను వాడబోతున్నారు. అలాగే ఈ విమానాల్లో వాడే జీఈ-404 ఇంజన్లను సైతం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇప్పటికే ఓ దశలో సమకూర్చుకుంది. గాల్లోనే విమానాలకు ఇంధనం నింపుకునేలా వీటికి రూపకల్పన చేస్తున్నారు. హెచ్ఏఎల్ నాసిక్ డివిజన్ ఈ యుద్ధవిమానాల తయారీలో పాలుపంచుకోనుంది.

ఆపరేషన్ సింధూర్ లో ఎదురైన అనుభవాలతో కేంద్రం విదేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ముందుగానే గుర్తించే పరికరాలతో పాటు ఇతర ఆయుధ వ్యవస్థల్ని సమకూర్చుకుంటోంది. వీటికి అదనంగా యుద్ధ విమానాల సంఖ్యను కూడా పెంచుతోంది. ఇందుకోసం భారీ ఎత్తున బడ్జెట్లను కేటాయిస్తోంది.అదే సమయంలో వీటిని విదేశాల నుంచి కొనుగోలు చేయడం కంటే ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద దేశీయంగా ఉన్న కంపెనీలు తయారు చేసి ఇచ్చేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే హెచ్ఏఎల్ కు ఇంత భారీ ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications