ఎన్నికల తాయిలాలు షురూ: ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. మే నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, ఈ దఫా గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రతిపక్షాల సంకీర్ణ కూటమి ఇండియా.. కసరత్తు సాగిస్తోన్నాయి. వ్యూహ, ప్రతి వ్యూహాలను పన్నుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది. వారికి గుడ్ న్యూస్ వినిపించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు చేసే కరవు బత్యాన్ని పెంచబోతోంది.

ప్రస్తుతం వారికి 42 శాతం కరవు బత్యం అందుతోంది. దీన్ని నెలవారీ వేతనంతో కలిపి చెల్లిస్తోంది కేంద్రం. ఇప్పుడు అమలులో ఉన్న కరవు బత్యానికి అదనంగా మూడు శాతాన్ని జత చేయనుంది. ఈ సంఖ్యను 45గా ప్రకటించనుంది. ఈ డీఏ పెంపుదల ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంది.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 47.58 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు ఉన్నారు. 69.76 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మూడు శాతం డీఏ మొత్తాన్ని పెంచడం వల్ల కేంద్ర ఖజానాపై 12,815 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.

దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకింత నిరాశ వ్యక్తమౌతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము నాలుగు శాతం డీఏ పెంపుదలనున కోరుతున్నట్లు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. డియర్నెస్ అలవెన్స్లో నాలుగు శాతం పాయింట్లను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నామని శివ గోపాల్ మిశ్రా చెప్పారు.
సంవత్సరానికి రెండుసార్లు డీఏను సవరించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 24వ తేదీన డీఏను సవరించింది కేంద్రం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి దీన్ని అమలులోకి తీసుకొచ్చింది. అప్పట్లో 38 శాతం ఉన్న డీఏను 42 శాతానికి పెంచింది. 2022 డిసెంబర్ నాటికి అందుబాటులో ఉన్న కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా దీన్ని నాలుగు పాయింట్ల పెంచింది.












Click it and Unblock the Notifications