సవరణలు అంగీకరించాలని రైతుల్ని కోరిన కేంద్రం- మీరు తగ్గితేనే చర్చలన్న అన్నదాతలు
వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల ఆందోళన నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో తాము ప్రతిపాదించిన సవరణలను మరోసారి పరిశీలించాలని కేంద్రం ఇవాళ కోరింది. వ్యవసాయ చట్టాల్లో సవరణలతో రైతులకు న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇవాళ రైతు సంఘాల నేతలకు స్పష్టం చేశారు.
రైతు సంఘాలతో జరగాల్సిన ఆరో దఫా చర్చలు విఫలమైన నేపథ్యంలో తదుపరి చర్చల తేదీలను ఖరారు చేయాలని వారికి కేంద్రమంత్రి తోమర్ సూచించారు. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ చట్టాల్లో ఏదైనా సవరణలకు అవకాశం ఉందేమో అన్న అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని తోమర్ తెలిపారు. రైతుల అనుమానాలన్నీ తొలగించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. అయితే ఇందుకోసం రైతు నేతల నుంచి వారి అభ్యంతరాలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

చర్చలకు రావాలని, తాము ప్రతిపాదించిన సవరణలు పరిశీలించాలని వ్యవసాయమంత్రి తోమర్ చేసిన విజ్ఞప్తిపై రైతుసంఘాల నేతలు స్పందించారు. వ్యయసాయ చట్టాలు వ్యాపారులకోసమే అని కేంద్రం అంగీకరించిందని, అసలు వ్యవసాయంపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు తప్ప కేంద్రానికి లేదని వారు తెలిపారు. తాము కోరిన విధంగా చట్టాలు వెనక్కి తీసుకోకపోతే రైలు మార్గాలను దిగ్బంధం చేస్తామన్న మాటకు కట్టుబడి ఉంటామన్నారు. అయితే కేంద్రం వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గితే మాత్రం చర్చలకు ముందుకొస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.












Click it and Unblock the Notifications