18-44 ఏళ్ల వయస్కులకు వ్యాక్సినేషన్ ప్రారంభం: స్టాక్ లేదంటూ రాష్ట్రాలు, కేంద్రం ఏం చెబుతోందంటే?
న్యూఢిల్లీ: మూడో దశ కరోనా వ్యాక్సిన్ నేటి(శనివారం-మే 1) నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సుమారు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించగా.. పలు రాష్ట్రాలు మాత్రం తమ వద్ద స్టాక్ లేదంటూ 18-44ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేశాయి.
నేటి నుంచే దేశంలో 18-44ఏళ్లవారికి వ్యాక్సిన్ ప్రారంభం
మే 1 నుంచి 18-44ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలకు అవసరమైన మేర వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపింది. అయితే, పలు రాష్ట్రాలు మాత్రం తమ వద్ద 45ఏళ్లకుపైబడిన వారికే వ్యాక్సిన్లు వేయడానికి స్టాక్ లేదని.. ఇప్పుడు 18-44 వయస్కులకు ఎలా వేయగలమని ప్రశ్నిస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్లో దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 28 నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 2.45 కోట్ల మంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
వ్యాక్సిన్ నోస్టాక్ అంటూ రాష్ట్రాలు
కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే తమ వద్ద వ్యాక్సిన్ స్టాక్ కొరత ఉందని తెలిపాయి. అయితే, కేంద్రం ఇప్పటి వరకు 16.33 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించామని హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో కోటికిపైగా కరోనా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వృథా అయిన వ్యాక్సిన్లతోపాటు వినియోగించిన మొత్తం వ్యాక్సిన్ డోసులు 15,33,56,503 అని అధికారులు వెల్లడించారు.
ప్రజలకు ఢిల్లీ సీఎం విజ్ఞప్తి.. ముంబైలో ఐదు కేంద్రాల్లోనే..
ఇది ఇలావుండగా, శనివారం నుంచి ఎవరూ కరోనా కేంద్రాల వద్ద వ్యాక్సిన్ కోసం బారులు తీరవద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ స్టాక్ వచ్చిన తర్వాత ప్రజలకు తెలియజేస్తామన్నారు. కాగా, ఆదివారం నాటికి 3 లక్షల కోవిషీల్డ్ డోసులు ఢిల్లీకి చేరనున్నాయి. వచ్చే రెండు నెలల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్లు 67 లక్షల వ్యాక్సిన్ డోసులను అందిస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. ముంబైలోని ఐదు వ్యాక్సిన్ కేంద్రాల్లో 18-44ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నాయర్ ఆస్పత్రి, బీకేసీ జుంబో ఫెసిలిటీ, కూపర్ ఆస్పత్రి, సెవెన్ హిల్స్ ఆస్పత్రి, రాజవాడి ఆస్పత్రిల్లో నేటి నుంచి వ్యాక్సిన్లు వేయనున్నారు. 20వేల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Recommended Video
తెలుగు రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్ వాయిదా..
వ్యాక్సిన్ కొరత కారణంగా పశ్చిమబెంగాల్ మే 1 నుంచి 18-44 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ వేయలేమని ఇప్పటికే స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా నేటి నుంచి వ్యాక్సిన్ వేయలేమని, మరింత సమయం కావాలని తెలిపింది. వ్యాక్సిన్ కొరత కారణంగా రాష్ట్రంలో 18-44ఏళ్ల వయస్కులకు వ్యాక్సినేషన్ ప్రారంభయానికి కొంత సమయం పడుతుందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మే 1 నుంచి వ్యాక్సిన్ వేయడం కుదరదని, జూన్ లేదా సెప్టెంబర్ నుంచి 18-44 వయస్కులకు వ్యాక్సిన్ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఇందుకు వ్యాక్సిన్ కొరతే కారణమని తెలిపింది.