ఏపీ, తెలంగాణ రగడ: వివాదాలపై కేంద్రం దృష్టి,సీరియస్
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర హోం శాఖ నడుం బిగించింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఢిల్లీకి పిలిపించాలని సూచించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈనెల 7వ తేదీన ఈ భేటీని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు అనిల్ గోస్వామి గురువారం లేఖ రాశారు.
కానీ, అదే రోజు కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశామని, కాబట్టి తేదీని మార్చాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్ కోరినట్లు తెలిసింది. అలాగే, అదే రోజు తాము కూడా వేరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని, కాబట్టి తేదీని మార్చాలని తెలంగాణ సీఎస్ కూడా కోరినట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఈ నెల 8 లేదా 10వ తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని హోం శాఖ నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల సీఎస్లను మారోమారు సంప్రదించి సమావేశ తేదీని ఖరారు చేస్తారు.