అయోధ్య రామాలయానికి విదేశీ విరాళాలు ! కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ మందిర నిర్మాణానికి స్వదేశీ విరాళాలే తీసుకుంటుండగా.. ఇకపై విదేశాల నుంచి కూడా విరాళాలు సేకరించేందుకు అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ FCRA అనుమతి మంజూరు చేసింది. ఇది అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశం వెలుపల నుండి ద్రవ్య విరాళాలను స్వీకరించడానికి ట్రస్ట్ని అనుమతిస్తుంది.
"శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) 2010 కింద స్వచ్ఛంద విరాళాలను స్వీకరించడానికి భారత ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖలోని FCRA (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) డిపార్ట్మెంట్ ఆమోదించింది" అని ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని ఎస్బీఐ 11 సంసద్ మార్గ్ బ్రాంచ్ లో ఉన్న రామాలయ బ్యాంక్ ఖాతాకు ఈ విరాళాలను పంపవచ్చని ట్రస్ట్ తెలిపింది.

విదేశీ మూలాల నుండి స్వచ్ఛంద విరాళాలను స్వీకరించడానికి కేంద్ర హోంశాఖ లోని FCRA విభాగం ట్రస్ట్ - శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని రిజిస్టర్ చేసింది. ఇలాంటి విరాళాలను కేంద్రం గుర్తించిన బ్యాంక్ ఖాతాకు మాత్రమే పంపవచ్చు. ట్రస్ట్ యొక్క ఏ బ్రాంచ్ లేదా మరే ఇతర బ్యాంక్ ఖాతాలో ఈ విరాళాలు అంగీకరించరని ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు ఇకపై ఈ ఖాతాకు విరాళాలు పంపేందుకు అవకాశం దొరికింది.
అయోధ్యలోని రామాలయం "ప్రాణ్ ప్రతిష్ఠ" లేదా ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తి కానుంది. దీంతో ఎన్నికలకు ముందు రామమందిరం ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసి మిగిలిన కార్యక్రమాల్ని ఆ తర్వాత పూర్తి చేయాలని ట్రస్ట్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications