బెంగళూరులో ఒక గంటలో 10 చైన్ స్నాచింగ్ లు
బెంగళూరు: బెంగళూరు నగరంలో చైన్ స్నాచింగ్ లు చేసి పారిపోతున్న దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గురువారం ఉదయం నగరంలో ఒక గంట వ్యవదిలో 10 చైన్ స్నాచింగ్ లు, సాయంత్రం వరకు మొత్తం 15 మంది మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కొని పోవడంతో అదే రోజు సాయంత్రం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క డీసీపీ వేకువ జామున నుండి నగరంలో రౌండ్స్ తిరగాలని సూచించారు.
అనుమానం వచ్చిన వెంటనే వాహనాలలో సంచరిస్తున్న వారిని సోదాలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశామని ఎంఎన్. రెడ్డి చెప్పారు.శుక్రవారం వేకువ జామున ఎం.ఎన్. రెడ్డి స్వయంగా బెంగళూరు నగరంలోని వివిద ప్రాంతాలలో గస్తి తిరిగారు.
విజయనగర, రాజాజీనగర, మల్లేశ్వరం, కంగేరి, యలహంక, సుంకదకట్ట, హోసూరు రోడ్డు, కామాక్షిపాళ్య, హెచ్ఎస్ఆర్ లేఔట్ తదితర ప్రాంతాలలో గస్తి తిరిగారు. అనుమానం రావడంతో పలు వాహనాలలో సంచరిస్తున్న వారిని సోదాలు చేశారు.
పోరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల పోలీసులతో సంప్రదించి నిందితులను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎం.ఎన్. రెడ్డి వివరించారు. అదే విధంగా బెంగళూరు గ్రామీణ జిల్లా, తుమకూరు, రామనగర, తమిళనాడులో ని హొసూరులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గురువారం చైన్ స్నాచింగ్ చేసిన నిందితులు బైక్ లో పారిపోతున్న సమయంలో విజయనగరలోని ఒక ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలలో వారి రూపు రేఖలు రికార్డు అయ్యాయి. ఆ క్లిప్పింగ్ లు సేకరించి పరిశీలిస్తున్నామని ఎం.ఎన్. రెడ్డి వివరించారు.