రాహుల్ కు లోక్ సభలో పార్టీ పక్ష నాయకుడిగా బాధ్యతలు
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే పిఎసి చైర్మెన్ గా ఈ ఏడాది ఏప్రిల్ లో బాద్యతలు స్వీకరించే అవకాశం ఉన్నందున ఆయన స్థానంలో రాహుల్ గాంధీ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా బాధ్యత
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తోన్న సమయంలోనే లోక్ సభలో ఆ పార్టీ పక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉందని ఓ వార్తాసంస్థ ప్రకటించింది.
గత మాసంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొంది. గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను ఆ పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై ముఖ్యంగా రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోన్న తరుణంలోనే లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడిగా రాహుల్ బాధ్యతలను చేపట్టే అవకాశం లేకపోలేదని ఆ వార్తా సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు. అయితే మల్లిఖార్జున ఖర్గే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పిఎసి) చైర్మెన్ గా నియమితులయ్యారు.దీంతో ఖర్గే స్థానంలో రాహుల్ గాంధీకి బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2019 జనరల్ ఎన్నికలు జరిగే వరకు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పార్టీ పక్ష నాయకుడిగా వ్యవహరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఖర్గే పిఎసి చైర్ పర్సన్ గా బాద్యతలను స్వీకరించనున్నారు.
పిఎసి డిప్యూటీ చైర్ పర్సన్ గా ఉన్న అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవి కూడ ఖాళీ కానుంది.ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత రాహుల్ గాంధీ పార్టీలో వ్యవస్థాగత మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ప్రకటించారు.
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని పిఎసి చైర్మెన్ గా నియమించడం బహుశా ఇదే ప్రథమం.ఈ ఏడాది చివర్లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలున్నాయి.అయితే అంతకన్నా ముందే ఆయన పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికైతే పార్టీకి ప్రయోజనమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
2019 ఎన్నికల వరకు రాహుల్ గాంధీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగాలని పార్టీలోని ఓ వర్గం కోరుకొంటుందని ప్రచారం సాగుతోంది.జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ చైర్మెన్ గా నియమిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.












Click it and Unblock the Notifications