ఢిల్లీలో వెలిగే చంద్రుడు ఎవరు..? నిలిచేదెవరు నిలబెట్టేదెవరు..?
దేశంలో ఆరువిడుతల ఎన్నికలు ముగియడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక ఒకే విడత పోలింగ్ మిగిలి ఉండటంతో కేంద్రంలో పలు రకాల ఈక్వేషన్స్ తెరపైకొస్తున్నాయి. ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రాంతీయపార్టీల పాత్ర కీలకం కానున్నట్లు తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఇక కేంద్రంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే బాధ్యత దాదాపు ప్రాంతీయ పార్టీలపైనే ఆధార పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.
కేంద్రంలో కీలకం కానున్న చంద్రబాబు కేసీఆర్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మొత్తం ఏడు విడతల పోలింగ్కు గాను ఆరు విడుతల పోలింగ్ పూర్తవడంతో ఇటు జాతీయ పార్టీలు అటు ప్రాంతీయ పార్టీలు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నాయి. అంతేకాదు కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు చక్కర్లు కొడుతుండటంతో ప్రాంతీయపార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందులో ముఖ్య భూమిక పోషిస్తోంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబులు కావడం విశేషం.
మోడీని వ్యతిరేకిస్తున్న పార్టీలతో టచ్లో చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నార్త్ నుంచి నరుక్కొస్తున్నారు. కాంగ్రెస్తో సహా ఉత్తరాది పాలిటిక్స్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మోడీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్రయత్నంలో తాను కూడా ప్రధాని పదవికి రేసులో ఉన్నారన్న విషయాన్ని బాబు చెప్పకనే చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు చక్రం తిప్పారంటే అసాధ్యమైనదీ ఏదీ లేదనే విషయం పలువురు జాతీయనాయకులు గుర్తు చేస్తున్నారు. ప్రధాని రేసులో తాను లేనని చంద్రబాబు చెబుతున్నప్పటికీ ఇతర జాతీయనాయకుల నోట్లలో బాబు పేరు నానుతుండటం చర్చనీయాంశమైంది.
ఊహకందని చంద్రబాబు చాణక్యం
ఇదిలా ఉంటే చంద్రబాబు రాజకీయం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఓ వైపు మమత బెనర్జీతో కలిసి వెళుతున్నారు అదే సమయంలో ఆమె శతృవుగా చూస్తున్న కాంగ్రెస్ను చంద్రబాబు లాలిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు ఎలాంటి రాజకీయ పాచిక వేస్తారా అని పొలిటికల్ సర్కిల్స్ ఎదురు చూస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రధాన లక్ష్యం మోడీని అధికారంలోకి రాకుండా చూడటమే. అంటే ఇక్కడ మోడీ మాత్రమే... బీజేపీ వచ్చినా ప్రధాని అభ్యర్థిగా మోడీ తప్ప మరే వ్యక్తి ఉన్న అందుకు చంద్రబాబుకు సమ్మతమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక చంద్రబాబు గతంలో ఎన్డీయే కన్వీనర్గా ఉన్న సమయంలో రాజకీయంగా ఢిల్లీలో చక్రం తిప్పిన సంగతి బహిరంగ రహస్యమే. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అనుభవానికి పదను పెడుతున్నారు బాబు. ప్రధాని రేసులో మమతా ఉన్నారు, మాయావతి ఉన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. కాంగ్రెస్కు సొంతంగా మెజార్టీ వస్తే ఇక రాహుల్ గాంధీ ఎలాగూ ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక రాహుల్ను వ్యతిరేకిస్తున్న మమతా, మాయావతి, కేజ్రీవాల్ను బాబు ఒప్పించగలుగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. లేకుంటే మమతా, మాయావతిల్లో ఒకరిని ప్రధానిగా ప్రకటించి కాంగ్రెస్ మద్దతు ఇచ్చేలా రాహుల్ను ఒప్పించగలుగుతారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది.
ఉపప్రధాని పదవి దక్షిణాది ప్రాంతీయ పార్టీలకే దక్కాలి: కేసీఆర్
చంద్రబాబు ఉత్తరం నుంచి నరుక్కొస్తుంటే...దక్షిణాది నుంచి మరో తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ చతురతకు పదను పెట్టారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీకాంగ్రెస్యేతర ప్రభుత్వాలు రావాలన్నది ఆయన కోరిక. కానీ పరిస్థితులు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్లను కలిసి తన రాజకీయ వ్యూహాన్ని పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో కూడా చర్చలు జరిపారు. ఇక తాజాగా స్టాలిన్ను కూడా కేసీఆర్ కలిసి తన వ్యూహాన్ని చెప్పే అవకాశం ఉంది. ప్రధానిగా ఉత్తరాది వ్యక్తి అయినా... ఉపప్రధానిగా దక్షిణాది నుంచి అదికూడా ప్రాంతీయ పార్టీలనుంచే ఉండాలన్నది కేసీఆర్ స్ట్రాటజీ. జగన్, పినరాయి విజయన్, స్టాలిన్, కుమారస్వామి,నవీన్ పట్నాయక్, శరద్ పవార్లాంటి నాయకులతో కేసీఆర్కు మంచి సంబంధాలున్నాయి. మరి ఇలాంటి సమయంలో వీరంతా ఆయనకు ఎంతవరకు సపోర్టుగా నిలుస్తారో చూడాలి. ఇక చంద్రబాబు మాట మాయావతి కానీ మమతా బెనర్జీకానీ వినేలా కనిపించడం లేదు. దీన్ని కేసీఆర్ క్యాష్ చేసుకుంటారా అనేదానిపై కూడా సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి. ఇక కేసీఆర్ అవసరం చంద్రబాబుకు ఉంది.. చంద్రబాబు అవసరం కేసీఆర్కు లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి చంద్రబాబును కేసీఆర్ ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి
ఇద్దరు
చంద్రులు
కేంద్రంలో
రాజకీయ
చక్రం
గట్టిగానే
తిప్పుతున్నారు.అయితే
ఎవరు
నిలబడుతారు..
ఎవరిని
నిలబెడుతారనే
విషయం
చాలా
ఇంట్రస్టింగ్గా
మారుతోంది.
కానీ
ఈ
క్యూరియాసిటీకి
బ్రేక్
పడాలంటే
మే
23
వరకు
అంటే
ఎన్నికల
ఫలితాలు
వచ్చే
వరకు
వేచిచూడక
తప్పదు.
మరో
వైపు
ఈ
ఈక్వేషన్స్
అన్నీ
హంగ్
పార్లమెంట్
వస్తేనే
వర్కవుట్
అవుతాయనే
సంగతి
మరువకూడదు.