ఎగతాళి చేశారు: విభజనపై చిరుకు బాబు కౌంటర్
హైదరాబాద్: సమన్యాయం అంటే ఏమిటని అడిగిన కేంద్ర మంత్రి చిరంజీవికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. సమన్యాయం అంటే ఏమిటో తాను చెప్పలేదని చిరంజీవి అన్నారని, కొంత మంది ఎగతాళి చేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను తెలంగాణను వ్యతిరేకించడం లేదని, విభజన తీరును ప్రశ్నిస్తున్నానని ఆయన అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా, ఇరు ప్రాంతాలకూ న్యాయం జరిగేలా చూడాలని తాను అడిగినట్లు తెలిపారు.
రాజధాని ఉన్న ప్రాంతం ఎక్కడా విభజనను కోరలేదని, దేశంలో ఇదే తొలి సంఘటన అని, హైదరాబాద్ వంటి నగర నిర్మాణానికి నాలుగు లక్ష కోట్లు కావాలని తాను అంటే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కన్నా బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని అన్నారని, రాజధాని అంటే ఓ భవనం కాదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో, తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు.

రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా విభజన జరగాలని ఆయన అన్నారు. స్టేక్ హోల్డర్లతో మాట్లాడి సామరస్యపూర్వకంగా విభజన చేయాలని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, తమ వద్ద ఉన్న వివరాలను చెప్పి, విడదీస్తే జరిగే లాభనష్టాలను చెప్పి ఏకాభిప్రాయాన్ని కూడగట్టే అవకాశం ఉండిందని, కానీ కేంద్ర ప్రభుత్వం అలా వ్యవహరించలేదని ఆయన అన్నారు.
ఓ రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు నిర్దిష్టంగా ప్రణాళికాబద్దంగా చేయలేదని ఆయన విమర్శించారు. విభజన విషయంలో రెండు ప్రాంతాల మధ్య విస్తృతాభిప్రాయం కావాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఏం ఇస్తారో స్పష్టంగా చెప్పాలని అడిగానని, కానీ అలా చేయలేదని, ఏం చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రజలపై, సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా లేరని, రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతోందని ఆయన అన్నారు.
అప్రజాస్వామికంగా బిల్లు తీసుకు రావడం దుర్మార్గమని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో చేర్చామని, అటువంటి నగరమంటే విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాలన్నీ ఉండాలని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెసు రాష్ట్రాన్ని విభజించిందని ఆయన విమర్శించారు. కఠినమైన నిర్ణయం తీసుకున్నామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్న మాటలను ఆయన తప్పుపట్టారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని చంద్రబాబు విమర్సించారు. సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కాకుండా కుట్రలూ కుతంత్రాలతో చేశారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీలు కంటితుడుపు చర్యలేనని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications