బాబు దూకుడు: 'పక్క' సీఎంల బెంగ, మోడీకి ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ప్రధాని నరేంద్ర మోడీకి పక్క రాష్ట్రాల నుండి ఫిర్యాదులు వెళ్తున్నాయి! నవ్యాంధ్ర ప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు జోరుగా పర్యటనలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆయన విదేశాలతో పాటు పక్క రాష్ట్రాలలో కూడా పర్యటించి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పెట్టుబడుల కోసం కర్నాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు.
ఈ సమయంలో చాలామంది పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఇన్సెంటివ్లు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా పెట్టుబడులు తీసుకు వచ్చేవారు. విదేశీ ప్రముఖులను హైదరాబాదుకు తీసుకు వచ్చి ఆకర్షించేవారు.
అయితే, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్టుబడులు కొంతమేర తగ్గాయనే వాదనలు ఉన్నాయి. పలు కంపెనీలు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు తరలి వెళ్లాయి. ఉద్యమం విషయం పక్కన పెట్టినప్పటికీ.. చాలా రోజులుగా ఐటీ రంగం పురోగతి ఆశించిన స్థాయిలో లేదనే వాదనలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాజధాని లేని కొత్త రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పర్యటనల ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. చంద్రబాబు భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. ఇవి తమ పైన ప్రభావం చూపుతాయని కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలో ఆందోళనలో ఉన్నాయంటున్నారు.
ఈ విషయమై కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు జయలలితలు మోడీకి లేఖలు కూడా రాశారు. బెంగళూరుకు వెళ్లి వ్యాపారదిగ్గజాలతో చంద్రబాబు భేటీ సిద్ధరామయ్యకు మింగుడు పడని విషయంగా మారిందని అంటున్నారు. బాబు దూకుడు ఇలాగే కొనసాగితే ఐటీ పరిశ్రమలు ఏపీకి బారులు తీరుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.