ఎన్డీయేలో పవన్, బాబు ప్రత్యేక ఆకర్షణ: సోనియాపై జెసి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నరేంద్ర మోడీని బిజెపి పార్లమెంటరీ బోర్డు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్న అనంతరం ఎన్డీయేతర పక్షాలు భేటీ అయ్యారు.
ఈ భేటీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, విజయకాంత్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఉద్దవ్ థాకరే తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో బాబు, పవన్, విజయకాంత్లు ఆకర్షగా నిలిచారు. మోడీ ఎన్డీయే పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే చంద్రబాబుకు ఆయన ప్రత్యేకంగా తెలిపారు. దీంతో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. ఇక మెగాస్టార్ సోదరుడిగా, ఇటీవలే పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ కూడా ఆకర్షణగా నిలిచారు. మోడీకి చంద్రబాబు శాలువా కప్పి సన్మానించగా, పవన్ అభినందించారు. ఈ భేటీలో టిడిపి, బిజెపి ఎంపీలు పాల్గొన్నారు.
కాంగ్రెసు పార్టీ పైన జెసి
కాంగ్రెస్ పైన టిడిపి పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నిన్నటి సిడబ్ల్యూసి సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీలు రాజీనామాలు చేయటం ఓ డ్రామా అన్నారు. వారిద్దరూ నకిలీ గాంధీలని ఆరోపించారు. కొత్త నాయకులు వస్తేనే కాంగ్రెస్కు మనుగడ ఉంటుందన్నారు.
తెలంగాణకే తొలి ప్రాధాన్యం: దత్తాత్రేయ
కేంద్రమంత్రిగా అవకాశం వస్తే తన తొలి ప్రాధాన్యం తెలంగాణకే అని సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ తెలిపారు. మహిళాభివృద్ధితోపాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక తెరాస మజ్లిస్ పార్టీతో కలవడం వెనుక ఉన్న మర్మమేంటో చెప్పాలన్నారు.