బిజెపితో పొత్తు: తెలంగాణపై చంద్రబాబు వ్యూహం?
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. తెలంగాణకు తాము అనుకూలమంటూనే సమన్యాయం పేరుతో తెలంగాణను అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన బిజెపితో పొత్తుకు తెర లేపినట్లు భావిస్తున్నారు.
తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు బిజెపి నిరాకరిస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతుంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి బిజెపి మద్దతు అనివార్యంగా మారిన స్థితిలో ఆయన బిజెపితో పొత్తుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. సీమాంధ్రకు చెందిన బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడి సహాయం కూడా తీసుకున్నట్లు విమర్శిస్తున్నారు. దీంతో వెంకయ్యనాయుడిపై తెలంగాణ బిజెపి నేతలు గుర్రుగా ఉన్నారు.

వెంకయ్య నాయుడిపై పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మరో రూపంలో మాట్లాడుతున్నారు. తెలంగాణకు మద్దతు ఇచ్చే విషయంలో తమ పార్టీ వెనక్కి తగ్గుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఆయన తప్పు పట్టారు. తెలంగాణ బిల్లుకు ఎట్టి స్థితిలోనూ తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటిస్తూ వచ్చారు. బిజెపిపై అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో తెలంగాణ బిజెపి నేతలు ముందుకు వచ్చారు.
అయితే, చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలను మానుకోలేదని అంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి హైదరాబాదు తిరిగి రావాల్సిన ఆయన నేరుగా హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ బిల్లును మంగళవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నట్లు వార్తలుగా రాగానే ఆయన మనసు మార్చుకుని హస్తినకు పయనం కట్టారు.
రాష్ట్ర విభజన తీరు ఇది కాదంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జాతీయ నేతల మద్దతును కూడగట్టేందుకు ఆయన తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. జాతీయ నేతలను పలువురిని కలుసుకున్నారు. ఢిల్లీలోని నేతలతోనే కాకుండా తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లి డిఎంకె అధినేత కరుణానిధిని, అన్నాడియంకె అధినేత జయలలిలతను కలిశారు. ముంబై వెళ్లి శివసేన నేత ఉద్ధవ్ థాక్రేను కలిశారు.
ఇదిలావుంటే, పార్లమెంటులో తెలంగాణ పార్లమెంటు సభ్యులు మౌనంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మాత్రం ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడమే తమ ధ్యేయమంటూ వారు ప్రతి రోజూ ప్రకటిస్తున్నారు. దీన్నిబట్టి చంద్రబాబు వ్యూహం ప్రకారం తెలంగాణను అడ్డుకోవడానికే పార్టీ పార్లమెంటు సభ్యులు పనిచేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు. ఏమైనా, ఆయన చివరి నిమిషంలో చక్రం తిప్పుతారా చూడాల్సిందే.












Click it and Unblock the Notifications