తెరమీదికి చంద్రయాన్ 3: శరవేగంగా ఇస్రో సన్నాహాలు: ముహూర్తం కూడా పెట్టేశారు
న్యూఢిల్లీ: చంద్రుడిపై పరిశోధనలను సాగించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ మూన్ తెర మీదికి వచ్చింది. చంద్రయాన్ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్లో మూడో ప్రయోగం వచ్చే సంవత్సరం చేపట్టనుంది. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా వచ్చే ఆరు నెలల్లో చంద్రుడిపైకి ల్యాండర్ను పంపించడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది. చంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో- దీని మీదే అందరి దృష్టి నిలిచింది.
చంద్రయాన్-2 విఫలం..
ఇదివరకు చంద్రయాన్-2 పేరుతో ఇస్రో.. చంద్రుడి మీదికి ల్యాండర్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అది విఫలమైంది. 2019 సెప్టెంబర్లో చందమామ మీద క్రాష్ ల్యాండ్ అయింది. చివరి నిమిషంలో విఫలమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు కోల్పోయింది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు.
క్రాష్ ల్యాండ్..
చంద్రుడిపై ల్యాండ్ చేసే సమయంలో దాన్ని వేగాన్ని నియంత్రించలేకపోయారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఎంత వేగంతో ప్రయాణించిందో.. అంతే వేగంతో క్రాష్ ల్యాండ్ అయింది. సరిగ్గా ఏడు సెకెన్లలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాల్సి ఉన్న సమయంలో అది గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలను కోల్పోయింది. ల్యాండర్ ఆచూకీ కనిపించలేదని కే శివన్ ప్రకటించారు. ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్కు ఎలాంటి సంకేతాలు అందలేదని ఇస్రో ఛైర్మన్ కే శివన్ అధికారికంగా ధృవీకరించారు. ల్యాండింగ్ మాత్రమే విఫలమైంది. శాటిలైట్ మాత్రం చంద్రుడి కక్షలోనే పరిభ్రమిస్తోంది.
వచ్చే ఏడాదే చంద్రయాన్ 3
దీని తరువాత మళ్లీ చంద్రయాన్-3 ప్రాజెక్ట్ను చేపట్టింది. దీన్ని విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిజానికి- 2023లో చంద్రుడి మీదికి రాకెట్ను ప్రయోగించాలని మొదట భావించారు. నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తి కావడంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చింది. వచ్చే సంవత్సరం అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో చంద్రయాన్-3 మిషన్ను ప్రయోగించే అవకాశం ఉంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
2022-23 మూడో త్రైమాసికంలో..
చంద్రయాన్ 3 మిషన్ను ఎప్పుడు ప్రయోగిస్తారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో చంద్రయాన్ 3ని ప్రారంభిస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో సమాజ్వాది పార్టీ సభ్యుడు రేవతి రమణ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూరక సమాధానం ఇచ్చారు. ప్రొపల్షన్ మాడ్యుల్, రోవర్ మాడ్యుల్, ల్యాండర్ మాడ్యుల్ పరీక్షలు పూర్తయ్యాయని అన్నారు.
Recommended Video
సెన్సర్, నేవిగేషన్ టెస్టింగ్స్ పూర్తి..
ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన, అత్యంత కీలకమైన సెన్సర్, నేవిగేషన్ టెస్టింగ్స్ అన్నీ పూర్తయ్యాయని జితేంద్ర సింగ్ చెప్పారు. ఇతర విభాగాల పరీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రుడిపైకి మానవ సహిత ప్రాజెక్టును చేపట్టే ఉద్దేశమేదీ లేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. మనుషులను చంద్రుడి మీదికి పంపించే ప్రతిపాదనలు ఏవీ లేవని స్పష్టం చేశారు. గగన్యాన్ తరువాతే దీని గురించి ఆలోచిస్తామని అన్నారు. గగన్ యాన్ విజయవంతమౌతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.