Chandrayaan-3: చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్-3, ఇప్పుడు ఎక్కడంటే?
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3 చంద్రుడివైపునకు మరింత చేరువైంది. సోమవారంతో చంద్రయాన్-3 ప్రయోగించి నెలల రోజులు పూర్తి కావడం గమనార్హం. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఈ వ్యోమనౌక.. సోమవారం చంద్రుడికి మరింత దగ్గరగా కదిలింది.
చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ISTRAC) నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్-3కి ఇది రెండో చివరి కక్ష్య. తాజా ప్రక్రియతో వ్యోమనౌక కక్ష్యను 150 కిలోమీటర్లు X 177 కి.మీలకు తగ్గినట్లు ఇస్రో తెలిపింది.

తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఆగస్టు 16న ఉదయం 8.30 గంటలకు చేపట్టనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ అంతరిక్షనౌక.. చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది.
కాగా, జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటి వరకు దశలవారీగా నాలుగుసార్లు పెంచి.. చంద్రయాన్-3ని చంద్రుడికి చేరువచేస్తున్నారు. ఐదో కక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది.
చంద్రుడి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. అంతా అనుకున్నట్లు సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయితే ఈ ప్రయోగం విజయవంతమైనట్లే. చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండ్ కాకపోవడం వల్లనే విఫలమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications