వేదమంత్రాలు జపించండి...అధిక పంట దిగుబడి పొందండి: గోవా మంత్రి
మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత వినే ఉంటారు. కానీ ఇక్కడ మంత్రాలు జపించండి... మంచి పంట దిగుబడిని పొందండి అంటూ చెబుతున్నారు. ఇది చెబుతున్నది మరెవరో కాదు... సాక్షాత్తు గోవా మంత్రి విజయ్ సర్దేశాయ్. తమ పొలాల్లో రోజు అరగంట పాటు వేదమంత్రాలు చదివితే మంచి పంట దిగుబడి వస్తుందని ఆయనగారు రైతులకు హితబోధ చేశారు. అంతేకాదు కాస్మిక్ ఫార్మింగ్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.
విజయ్ సర్దేశాయ్ భార్య శివ్ యోగ్ కాస్మిక్ ఫార్మింగ్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి విజయ్ సర్దేశాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు విశ్వవ్యవసాయాన్ని బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోందంటూ ఆయన చెప్పారు. కాస్మిక్ వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు లేని స్వచ్ఛమైన పంట వస్తుందని మంత్రిగారు సెలవిచ్చారు. కాస్మిక్ ఫార్మింగ్ పద్ధతిలో వరిపై ఎలాంటి పురుగుల మందు వాడమని సేంద్రీయ ఎరువులు ద్వారానే పంట పండుతుందని చెప్పారు.
అధికారులు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన సర్దేశాయ్... ఇతర రాష్ట్రాలపై గోవా ఆధారపడకూడదని ఆ విధంగా పనిచేయాలని ఆదేశించారు. కృషి యోగ్ ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలమని అందుకే ముందుగా గోవాలో దీన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కాస్మిక్ ఫార్మింగ్ ద్వారా రైతులు లాభపడ్డారని చెప్పిన ఆయన సైన్స్ వెనక మరో సైన్స్ దాగి ఉందనే సత్యాన్ని తెలియజేశారన్నారు.