జేఎన్యూ: సుప్రీం కోర్టులో నినాదాలు, వాగ్వాదం
న్యూఢిల్లీ: పటియాల హౌస్ న్యాయస్థానం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్యకుమార్ను న్యాయస్థానంలో విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా న్యాయవాదులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం శ్రుతిమించి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తమపైనా కొందరు దాడికి యత్నిచినట్లు జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి కోర్టు ప్రాంగణంలోనే ర్యాలీ చేపట్టారు. కన్నయ్యకుమార్కు వ్యతిరేకంగా ఓ వర్గం, అనుకూలంగా మరో వర్గం న్యాయవాదులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ ఘటనలతో న్యాయస్థానం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
అంతకుముందు కూడా, పలువురున్యాయవాదులు పటియాలా హౌజ్ కోర్టు లాబీల్లో వందేమాతరం నినాదాలు చేశారు. కాగా, ఆ న్యాయవాదులతో ప్రశాంత్ భూషణ్ వాగ్వాదానికి దిగారు.
ఇరువర్గాల న్యాయవాదుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారడంతో ప్రాసిక్యూషన్ లాయర్లను మాత్రమే లోనికి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో మిగితా వారు కోర్టులో ఉండదని స్పష్టం చేసింది.
కాగా, జేఎన్యూలో జాతివ్యతిరేక నినాదాలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై మంగళవారం పలువురు న్యాయవాదులు దాడి చేసిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి.
జేఎన్యూలో విద్యార్థి సంఘం నేత కన్నయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని ఆయన మద్దతుదారులు చెబుతుండగా, దేశ ద్రోహానికి పాల్పడినవారికి మద్దతు పలకడం సరికాదని మరికొందరు విద్యార్థులు అంటున్నారు. కన్నయ్య కుమార్ను ఈరోజు కోర్టు విచారించనుంది.
ఇది ఇలా ఉండగా, జేఎన్యూ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలో తనిఖీలు చేపట్టారు. బుధవారం ఢిల్లీ కోర్టులో పోలీసులు నివేదిక సమర్పించే అవకాశం ఉంది.