గ్యాంగ్స్టర్ నరికివేత: వరుస హత్యలతో వణుకుతున్న చెన్నై
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరం వరుస హత్యలతో వణికిపోతోంది. నాలుగురోజుల క్రితం నుంగంబక్కమ్ రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు నరికి చంపిన విషయం తెలిసిందే. ఆ దారుణం మరువకముందే మరో హత్య జరిగింది.
నందనం అనే ప్రాంతంలో సోమవారం వేలు అనే గ్యాంగ్స్టర్(రౌడీ షీటర్)ను దారుణంగా నరికి చంపారు. ప్రత్యర్థి వర్గం అతడ్ని హతమార్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నందనం అనే ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే ఆరు హత్య జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, రెండో వీడియో రిలీజ్, కష్టమే!: తండ్రి విజ్ఞప్తి
వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. కాగా, చెన్నైలో పేరు మోసిన రౌడీ షీటర్ సీడీ మణి అనుచరులతో సహా 150మందికిపైగా నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇది ఇలా ఉండగా, స్వాతి హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నుంగంబక్కమ్ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. హంతకుడు నీలం రంగు చొక్క ధరించి ఉన్నాడని, హత్య చేసిన తర్వాత రైలు పట్టాలు దాటి పారిపోయినట్లు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.