కూలిన భవనం: 29కి మృతులు, ప్రాణాలతో ముగ్గురు
చెన్నై: తమిళనాడులోని చెన్నై శివారులో 11 అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. మంగళవారం శిథిలాల నుంచి మూడు మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో మరో పది నుంచి 20మంది వరకు ఉండి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి ఇద్దరరినీ, మంగళవారం ఉదయం మరొకరినీ సజీవంగా బయటికి తీసినట్లు సీనియర్ పోలీస్ అధికారి కరుణా సాగర్ తెలిపారు. గాయాలపాలైన వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మరో 26మంది క్షతగాత్రులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా భవన శిథిలాల్లో మరో 15 నుంచి 20 మంది చిక్కుకుని ఉండవచ్చని ఆయన తెలిపారు. వారందర్నీ వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

శిథిలాల కిందినుంచి ఆదివారం ఉదయం సుజాత, కృష్ణవేణి అనే ఇద్దరు మహిళలను కాపాడారని, దీంతో ఇప్పటివరకు శిథిలాలకింది నుంచి కాపాడిన వారి సంఖ్య 30కి చేరుకుందని పోలీసులు చెప్పారు. దుర్ఘటన జరిగిన స్థలం వద్ద అగ్నిమాపక శాఖకు చెందిన వందమందికి పైగా సిబ్బందితో పాటు జాతీయ ప్రకృతి వైపరీత్యాల సహాయక దళం (ఎన్డిఆర్ఎఫ్)కు చెందిన మరో 120 మంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెన్నై పోలీసు కమిషనర్ ఇప్పటికే సంఘటనా స్థలాన్ని సందర్శించారని, అయిదుగురి అరెస్టు చేసారని, సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆదివారం సంఘటనా స్థాలాన్ని సందర్శించిన అనంతరం తమిళనాడు పోలీసు డైరెక్టర్ జనరల్ కె రామానుజం విలేఖరులకు చెప్పారు.
కాగా, భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 2లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున పరిహారాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, అలాగే ప్రభుత్వ ఖర్చులపై వారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications