చెన్నై వరద: హిందూ జంట కూతురి పేరు యూనుస్
చెన్నై: ఓ వైపు రాజకీయ నాయకులు అసహనం అంటూ గగ్గోలు పెడుతుంటే, సామాన్యులకు మాత్రం అదేమీ పట్టడం లేదు. పరమత సహనంతో మెలుగుతున్నారు. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు వచ్చి జనం అష్టకష్టాలు పడిన విషయం తెలిసిందే.
వరదల నేపథ్యంలో తన రెండు ఫ్లాట్లలోకి వచ్చి ఎవరైనా ఉండవచ్చునని మహమ్మద్ యూనుస్ అనే యువకుడు సూచించాడు. అలా అతడి అపార్టుమెంటులో తలదాచుకున్న వారిలో చిత్ర, మోహన్ అనే హిందూ దంపతులు కూడా ఉన్నారు.
వీళ్లు నివాసం ఉంటే ఉరప్పక్కం ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. పడవల ద్వారా రక్షించే వారు ఉరప్పక్కం వెళ్లి అక్కడి జనాలను రక్షించి యూనుస్ ఇంటికి తీసుకు వచ్చారు. అందులో ఓ నిండు గర్భిణీ ఉంది. ఆమె ఆసుపత్రిలో శనివారం నాడు పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.
తమను కాపాడిన యూనుస్ పేరును ఆమె తన బిడ్డకు పెట్టుకున్నారు. ఈ విషయం గురించి యూనుస్కు వాట్సాప్ ద్వారా సందేశం పంపించారు. ఓసారి వచ్చి మిమ్మల్ని కలుస్తామని కూడా వారు చెప్పారు. ఇక నుంచి తమ జీతంలో కొంతమొత్తాన్ని పేదలకు ఇస్తామని చెప్పారు.