చెన్నై వరదలో మునిగి.. శ్రీలంకలో శవమై తేలాడు
రామేశ్వరం: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తమిళనాడును అతలాకుతలం చేశాయి. కాగా, చెన్నై వరదల్లో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మృతదేహం శ్రీలంక సముద్ర జలాల్లో లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల చెన్నైలో సంభవించిన భారీ వరదలకు పూమిదురై అనే వ్యక్తి కొట్టుకుపోయాడు.
అందరూ అతని కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరికి అతని మృతదేహం శ్రీలంకలోని త్రిన్కోమల్లే సముద్రతీరంలో లభ్యమైంది. స్థానిక మత్స్యకారులు అతని మృతదేహాన్ని గుర్తించి.. అధికారులకు సమాచారం అందించారు.
అతని వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా అతను చెన్నై వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి.. శ్రీలంకలోని భారత రాయబారి కార్యాలయానికి సమాచారం అందించారు. పూమి దొరై టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నట్లు తెలిసింది.

ముమ్మరంగా సహాయక చర్యలు
వరద కల్లోలానికి అతలాకుతలమైన చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర సహాయ చర్యలు చేపట్టింది. వరద నీరు తగ్గిపోవడంతో గడప గడపకు సాయం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.
పేరుకుపోయిన మట్టిదిబ్బలు, వాటికారణంగా నిలిచిపోయిన మురుగునీటి వ్యవస్థను పునరుద్ధరించేందుకు చెన్నై నగరపాలకమండలి సిబ్బందికి సహాయంగా జిల్లాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను జయలలిత సర్కార్ చెన్నైకి రప్పించింది. దీంతో సోమవారం చెన్నైలో ఎక్కడచూసినా ముమ్మర సహాయ చర్యలు కొనసాగుతున్న దృశ్యాలే కనిపించాయి.












Click it and Unblock the Notifications