ఎన్నికల ఎఫెక్ట్ మరి: చెన్నైపై నిధులు గుమ్మరింత: వేల కోట్లు: డిస్కవరీ క్యాంపస్
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. మరో ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టును ప్రకటించిన ఆయన సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్.. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకుని వచ్చింది. నిధులను గుమ్మరించింది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ప్రధాని కొద్దిసేపటి కిందటే శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు.

రూ.3,770 కోట్లతో
చెన్నై జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశ విస్తరణ పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. తొలిదశ విస్తరణ పనుల విలువ 3,770 కోట్ల రూపాయలు. చెన్నై ఉత్తర ప్రాంతం నుంచి విమానాశ్రయం, సెంట్రల్ రైల్వే స్టేషన్ను అనుసంధానించేలా 9.05 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించబోతోన్నారు. దీనితో పాటు చెన్నై బీచ్-అత్తిపట్టి స్టేషన్ల మధ్య 22.1 కిలోమీటర్ల పొడవు ఉన్న నాలుగో లైన్ను మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దీని విలువ 293.40 కోట్ల రూపాయలు. చెన్నై-తిరువళ్లూర్ జిల్లాల మధ్య రైళ్ల రాకపోకలు నిరాటంకంగా సాగడానికి ఈ లైన్ ఉపయోగపడుతుంది.

ఐఐటీ-మద్రాస్ పరిధిలో డిస్కవరీ క్యాంపస్..
ప్రతిష్ఠాత్మక ఐఐటీ-మద్రాస్కు అనుబంధంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న డిస్కవరీ క్యాంపస్ నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. చెన్నై శివార్లలోని థియ్యూర్ వద్ద దీన్ని నిర్మితం కాబోతోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను కేటాయించింది. రెండు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ రూపుదిద్దుకోనుంది. రెండేళ్ల కాల వ్యవధిలో దీని నిర్మాణం పూర్తి కావచ్చని చెబుతున్నారు.

డీఆర్డీఓ అభివృద్ధి చేసిన యుద్ధ ట్యాంక్ను సైన్యానికి అప్పగింత..
డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అర్జున్ యుద్ధ ట్యాంక్ ఎంకే-1ఏను ప్రధాని లాంఛనప్రాయంగా సైన్యానికి అప్పగించారు. డీఆర్డీఓ ఛైర్మన్ జీ సతీష్ రెడ్డి చేతుల మీదుగా ఆ ట్యాంక్ను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణేకు అప్పగించారు. అనంతరం దాని సాంకేతిక పరిజ్ఞానాన్ని, పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాని.. ప్రసంగించారు. తమిళనాడు రైతులను కొనియాడారు. ఏడాదికేడాది వ్యవసాయోత్పత్తులు, పంట దిగుబడిని పెంచుకుంటున్నారని ప్రశంసించారు.

సిటీ ఆఫ్ నాలెడ్జ్..
చెన్నై నగరం.. దేశంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగిందని, సిటీ ఆఫ్ నాలెడ్జ్గా గుర్తింపు పొందిందని ప్రధాని అన్నారు. లీడింగ్ ఆటోమొబైల్ హబ్గా పేరు తెచ్చుకుందని చెప్పారు. తమిళనాడుకు డిఫెన్స్ కారిడార్ను ప్రకటించామని పేర్కొన్నారు. 8,100 కోట్ల రూపాయలతో ఈ కారిడార్ను ఏర్పాటు చేయబోతోన్నామని తెలిపారు. వ్యవసాయం, రక్షణరంగం, ఆటోమొబైల్ సెక్టార్లో తమిళనాడు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ దూకుడును కొనసాగింజేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications