బాలికపై అత్యాచారం, దారుణ హత్య: టెక్కీకి మరణశిక్ష: సమర్థించిన మద్రాసు హైకోర్టు !
చెన్నై: చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి ట్రయల్ కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పును మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఇలాంటి నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదిస్తే నేరాలు పెరిగిపోయే అవకాశం ఉందని మద్రాసు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
చెన్నైలో నివాసం ఉంటున్న ఎస్. దశ్వంత్ (23) ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసేవాడు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న 7 సంవత్సరాల చిన్నారికి మాయమాటలు చెప్పిన దశ్వంత్ అతని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
బాలిక ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెబుతుందనే భయంతో దశ్వంత్ బాలికను హత్య చేసి మృతదేహాన్ని తీసుకు వెళ్లి చెన్నై నగరం సమీపంలోని హైవే పక్కన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్పట్లో సంచలనం కలిగించిన ఈ కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
పలుకోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఒక శునకం (కుక్క) సహాయంతో దశ్వంత్ ను అరెస్టు చేశారు. కేసు విచారణ చెంగల్ పట్టులోని మహిళా కోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది డిసెంబర్ లో దశ్వంత్ జామీనుపై బయటకు వచ్చాడు. తరువాత ఇంటిలో నగదు ఇవ్వాలని దశ్వంత్ అతని తల్లిదండ్రులను వేధించాడు.
నగదు ఇవ్వడానికి నిరాకరించిన తల్లి సరళను దారుణంగా హత్య చేసిన దశ్వంత్ ఆమె శరీరం మీద ఉన్న బంగారు నగలు లాక్కొని ముంబై పారిపోయాడు. పోలీసులు అనేక బృందాలు ఏర్పాటు చేసి గాలించి ముంబైలో దశ్వంత్ ను అరెస్టు చేసి చెన్నై తీసుకువచ్చారు.
2018 ఫిబ్రవరి 19వ తేదీ చెంగల్ పట్టులోని మహిళా కోర్టు న్యాయమూర్తులు ఎస్. విమల, రామలింగం నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ దశ్వంత్ కు మరణశిక్ష విధించింది. అదే రోజు కోర్టు నుంచి బయటకు తీసుకువస్తున్న దశ్వంత్ మీద అనేక మంది మహిళలు, హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులు దాడి చేశారు.
చెంగల్ పట్టు మహిళా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దశ్వంత్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. చెంగల్ పట్టు మహిళా కోర్టు ఇచ్చిన తీర్పురు మద్రాసు హైకోర్టు సమర్థించి దశ్వంత్ కు మరణశిక్షను ఖరారు చేసింది. దశ్వంత్ తల్లి సరళ హత్య కేసు విచారణలో ఇంకా తీర్పు రావాల్సి ఉంది.