చెన్నై: అతివేగం ఓ మహిళా టెక్కీ ప్రాణాలు తీసింది
చెన్నై: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళా టెక్కీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఈరోడ్కు ఆర్ పూర్ణిమ అనే 22 ఏళ్ల యువతి షోలింగనల్లూర్లోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తుంది.
శనివారం మధ్యాహ్నాం గుడికి వెళ్లిన పూర్ణిమ తిరిగి తాను నివాసం ఉంటోన్న ప్రాంతానికి తిరిగి వస్తోన్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్ మహాబలిపురం నుంచి ఈస్ట్ కోస్ట్ రోడ్డును కలిపే కేకే సలాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
అతి వేగంగా వస్తున్న కారు... ఆటో రిక్షాను తప్పించబోయి నడుచుకుంటూ వస్తున్న పూర్ణిమను ఢీకొట్టింది. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో ఆమె చేతలో ఉన్న ప్రసాదం చెల్లాచెదురుగా పడిపోయింది. ఈ రోడ్డు ప్రమాదంపై స్థానికులు వెంటనే సమీపంలో ఉన్న సెమ్మన్ చేరీ పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుండీ ట్రాఫిక్ పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. మందుగు ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసి, అనంతరం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి టాటా సుమో కారణమని అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్ణిమ చనిపోయిన విషయాన్ని ఈరోడ్లోని తల్లిదండ్రులకు కూడా సమాచారమిచ్చినట్టు పోలీసులు తెలిపారు.