టిసిఎస్ టెక్కీ హత్య: 7 రోజుల పోలీస్ కస్టడీకి నిందితులు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై టిసిఎస్లో పని చేసిన 24 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగిని ఉమా మహేశ్వరిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన కేసులో నిందితులు ఇద్దరిని పోలీసు కస్టడీకి అప్పగించారు. పోలీసులు నిందితులను చెంగల్పట్ న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో... న్యాయస్థానం మార్చి 4వ తేదీ వరకు వారిని పోలీసు కస్టడీకి ఇచ్చింది.
కాగా, టెక్కీ ఉమా మహేశ్వరిపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ టెక్కీ హత్య కేసులో ఇద్దరు నిందితులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 13న ఆమె హత్యకు గురయితే 9 రోజుల తర్వాత శవం టిసిఎస్కు అర కిలోమీటర దూరంలోని సిప్కాట్ ఐటి పార్కు వద్ద కనుగొన్నారు.
ఇద్దరు భవన నిర్మాణ కూలీలే టెక్కీపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వీరిద్దరూ పశ్చిమ బెంగాల్కు చెందినవారు. టెక్కీ హత్య జరిగిన తర్వాత సంఘటనకు సమీపంలో ఉన్న భవన నిర్మాణానికి ఇద్దరు కూలీలు రావడంలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే హత్యోదంతం గురించి వారు వివరించారు. ఆ రోజు టెక్కీ ఉమా మహేశ్వరి రాత్రి పొద్దుపోయాక 10 గంటల ప్రాంతంలో ఒక్కతే కార్యాలయం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు కూడా సరిగా లేకపోవడంతో చీకటిగా ఉంది.
ఆ స్థితిలో అక్కడే ఉన్న తామిద్దరం ఆమెను అటకాయించి, ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు వారు పోలీసు విచారణలో తెలిపారు. అత్యాచారం చేసిన అనంతరం ఆమె పొట్టపైనా, మెడపైనా గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది.
దీంతో ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఫిబ్రవరి 22న గుర్తు తెలియని శవంగా తొలుత భావించినా అది టెక్కీదేనని తేలడంతో నిందితుల కోసం వేట సాగించారు. ఎట్టకేలకు కూలీలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. దీంతో సిప్కాట్ వద్ద భద్రతను పెంచారు.