తెరపైకి మరో కేసు: చిబరంకు మరిన్ని సీబీఐ కష్టాలు
న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నుంచి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే ఇప్పుడు సీబీఐ మరో కేసును తిరగదోడుతోంది. అడ్వాన్స్డ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ పీవీటీ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థలోకి ఛార్జీల పేరుతో 11 సంస్థల నుంచి కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా తరలించినట్లు అభియోగాలు గుర్తించింది.
ఈ కంపెనీకి ఐఎన్ఎక్స్ మీడియా కేసుతో సంబంధం ఉందని, ఆ కంపెనీ కార్తీ చిదంబరంకు సంబంధించినదని సీబీఐ వర్గాలు వన్ఇండియాకు తెలిపాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆమోదం పొందిన ఎఫ్ఐపీబీల నుంచి మాత్రమే చెల్లింపులు స్వీకరించాల్సి ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధం చేసిన సీబీఐ.. చిదంబరంను ప్రశ్నించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.
చిదంబరానికి మరోషాక్
చిదంబరం, ఆయన భార్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నళినీ చిదంబరానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. సీనియర్ అడ్వకేట్ హోదాను దంపతులిద్దరూ దుర్వినియోగపర్చారని నోటీసులు పేర్కొంది.
సెప్టెంబర్ 28 ఉదయం 11.30గంటలకు తమ ఎదుట హాజరుకావాలని బార్ కౌన్సిల్ ఆదేశించింది. బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు జె. గోపాలకృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు.
వివిధ ఆర్థిక, క్రిమినల్ నేరాల్లో నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులు.. సీనియర్ అడ్వకేట్లుగా ఎలా సుప్రీంకోర్టుకు హాజరవుతారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ అడ్వకేట్ పదానికి అప్రతిష్టపాలు చేస్తున్నారని వివరించారు. దీంతో నలుగురు సభ్యులతో కూడిన బార్ కౌన్సిల్ కమిటీ ఈ మేరకు నోటీసులు పంపింది.