కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్న కేవీ సుబ్రమణియన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తైన సందర్భంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఇక పరిశోధన, విద్యా ప్రపంచం వైపు తిరిగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు డాక్టర్ కేవీ సుబ్రమణియన్ తెలిపారు.
ప్రభుత్వంలో మూడేళ్లపాటు పనిచేసిన కాలంలో అద్భుతమైన ప్రోత్సాహం, మద్దతు లభించాయి. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, కీలక వ్యక్తులతోనూ స్నేహపూర్వక సంబంధాన్ని ఆస్వాదించాను. ఈ క్రమంలో దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు.

అంతేగాక, దాదాపు మూడు దశాబ్దాల వృత్తి జీవితంలో ప్రధాని నరేంద్ర మోడీ వంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడిని ఎన్నడూ చూడలేదని కేవీ సుబ్రమణియన్ తెలిపారు. కేవలం ప్రధాని మోడీనే కాకుండా ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్, ఆ విభాగంలోని ఇతర ఉన్నతాధికారులతో పదవీ కాలంలో తనకు ఎదురైన అనుభవాలను కేవీ సుబ్రమణియన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
I have decided to return back to academia following the completion of my 3-year fulfilling tenure. Serving The Nation has been an absolute privilege 🙏and I have wonderful support and encouragement🙏. My statement: @PMOIndia @narendramodi @FinMinIndia @nsitharamanoffc @PIB_India pic.twitter.com/NW5Y64kxJ6
— K V Subramanian (@SubramanianKri) October 8, 2021
కాగా, 2018 డిసెంబర్ 7న కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేవీ సుబ్రమణియన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆ పదవిలో ఉన్న అరవింద్ సుబ్రమణియన్ వైదొలిగిన ఐదు నెలలకు కేవీ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సీఈఏగా మూడేళ్ల పదవీకాలం ముగియడంతో కేవీ సుబ్రమణియన్ బాధ్యతల నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై విద్యా సంస్థల్లో పరిశోధనలవైపు తన పయనాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు సుబ్రమణియన్.












Click it and Unblock the Notifications