సీఎంలను అవమానిస్తున్నారు-మీటింగ్కి పిలిచి మాట్లాడనివ్వరా-ఎందుకంత భయం : మోదీపై దీదీ ఫైర్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ఇటీవల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొంతమంది బీజేపీ ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ఫెడరల్ స్పూర్తికి ప్రధాని విఘాతం కలిగిస్తున్నారని... ముఖ్యమంత్రులను అవమానిస్తున్నారని విమర్శించారు.
'ఇది చాలా దురదృష్టకరం. సమావేశంలో ప్రధాని మోదీ,బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రమే మాట్లాడారు. ప్రధాని మాతో మాట్లాడలేదు. కనీసం మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. కేవలం కొంతమంది జిల్లా మెజిస్ట్రేట్స్తో మాట్లాడారు. ఒకరకంగా ఇది ముఖ్యమంత్రులను అవమానపరచడమే. ముఖ్యమంత్రులు చెప్పేది వినేందుకు ఆయన ఎందుకంతలా భయపడుతున్నారు... అభద్రతా భావంలో ఉన్నారా...? మోదీతో సమావేశం వన్ నేషన్-ఆల్ హ్యుమిలియేషన్(ఒకే దేశం-అందరినీ అవమానపర్చడం)లా ఉంది.' అంటూ మమతా బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు.

ఒకవేళ ముఖ్యమంత్రులు చెప్పేది వినడం ఇష్టం లేకపోతే... సమావేశానికి ఆహ్వానించడమెందుకు అని మమతా ప్రశ్నించారు. మోదీకి అహంకారం ఎక్కువ అని మండిపడ్డారు. 'సమావేశంలో చాలా రాష్ట్రాలు పాల్గొన్నాయి. కానీ బీజేపీ ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు. యూపీ,ఆంధ్రా,ఛత్తీస్గఢ్ల నుంచి జిల్లా మెజిస్ట్రేట్లకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇక ఏ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వలేదు. అసలు వాళ్లు ఏమనుకుంటున్నారు... మేమేమైనా నిర్బంధ కార్మికులమా లేక ఆడించినట్లు ఆడేవాళ్లం అనుకుంటున్నారా...?' అని ప్రశ్నించారు.
తానేమీ అందరి ముఖ్యమంత్రుల తరుపున వకల్తా పుచ్చుకుని మాట్లాడట్లేదని మమతా బెనర్జీ అన్నారు. కానీ జరుగుతున్నదేమిటీ... మోదీ నియంతృత్వం కాదా అని ప్రశ్నించారు. బెంగాల్లో వ్యాక్సిన్ల కొరతపై తాను మోదీతో మాట్లాడాలనుకున్నానని.. కానీ ఆ అవకాశం లేకుండా చేశారని అన్నారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్న మోదీ వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. గతంలోనూ ఇలాగే దేశంలో కరోనా అంతమైందని చెప్పారని... కానీ ఆ తర్వాత కేసులు పెరిగాయని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications