భిన్నమైన స్టేట్మెంట్స్... చైనా వాదన ఒకలా.. భారత్ మరోలా... అసలేం జరుగుతోంది...
భారత్-చైనా మధ్య తూర్పు లదాఖ్లోని గాల్వన్ వ్యాలీలో జూన్ 15న తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి తూర్పు లదాఖ్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఎట్టకేలకు చర్చల ద్వారా ఫుల్ స్టాప్ పడింది. ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే సైన్యాల ఉపసంహరణపై తాజాగా భారత్,చైనా భిన్నమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

భిన్నమైన స్టేట్మెంట్స్...
తూర్పు లదాఖ్లోని చాలా ప్రాంతాల నుంచి ఇప్పటికే సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు చైనా ప్రకటించింది. అయితే భారత్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. సైన్యం ఉపసంహరణకు సంబంధించి చైనా వైపు నుంచి కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ... ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ స్పష్టం చేసింది. అయితే సైన్యం ఉపసంహరణ విషయంలో చైనా నిబద్దతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

చైనా ఏమంటోంది...
భారత్లో చైనా రాయబారి సున్ వెయిడాంగ్ మాట్లాడుతూ... చైనా భారత్కు వ్యూహాత్మక ముప్పు కాదన్నారు. తూర్పు లదాఖ్లోని చాలావరకు ఘర్షణ ప్రాంతాల్లో.. ఇరు దేశాలు సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయని చెప్పారు. సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం క్రమంగా తగ్గుతోందని... శాంతిని నెలకొల్పేందుకు చైనా కట్టుబడి ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఎలాంటి విభేదాలున్నా... చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుని.. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అన్నారు.ఇరు దేశాలు స్నేహపూర్వక సహకారానికి కట్టుబడి రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను పాటుపడాలని సున్ వెయిడాంగ్ పేర్కొన్నారు.

వాస్తవ పరిస్థితులు వేరేలా...
సైన్యం ఉపసంహరణపై చైనా చెప్తున్న మాటలు... వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయన్న కథనాలు తెర పైకి వస్తున్నాయి. లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న నాలుగు ఘర్షణ పాయింట్లలో గోగ్రాలోని పాంగోంగ్ త్సో, పెట్రోలింగ్ పాయింట్ 17 ఏ నుండి చైనా సైనికులు ఇంతవరకు వెనక్కి తగ్గలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఇరు వైపులా 50 మంది సైనికులు ఒకరికొకరు కిలోమీటరు దూరంలో ఉన్నారన్న ప్రచారం ఉన్నది. అయితే గాల్వన్ వ్యాలీలోని పీపీ 14,పీపీ 15ల నుంచి మాత్రం చైనా ఇప్పటికే తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం గమనార్హం.

ఫింగర్ 4లో ఇప్పటికీ చైనా సైన్యం...
సైన్యం ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా చైనీయులు ఫింగర్ 4 బేస్ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఫింగర్ 5 వైపు వెళ్ళారు. కాని ఇప్పటికీ వారు ఫింగర్ 4 వద్ద రిడ్జ్లైన్లో స్థానాలను ఆక్రమించే ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇండియా-చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం గత వారం వర్చువల్ విధానంలో వర్కింగ్ మెకానిజంపై చర్చలు జరగ్గా... వీలైనంత త్వరగా సైన్యం ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీనిపై మున్ముందు మిలటరీ స్థాయిలో మరిన్ని చర్చలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications