మింగుడుపడని పరిణామాలు... చైనా చెప్పేదొకటి,చేసేదొకటి... శాటిలైట్ చిత్రాల్లో సంచలన విషయాలు
తూర్పు లదాఖ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసంహరణకు భారత్-చైనా మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిన మరుసటిరోజే మరో సంచలన విషయం వెలుగుచూసింది. గాల్వన్ వ్యాలీలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మాణాలను కొనసాగిస్తున్నట్టుగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలుగుచూశాయి. ఎల్ఏసీ వెంబడి మే 4వ తేదీ నుంచి చైనా ఈ నిర్మాణాలను చేపడుతోంది. అప్పటినుంచి భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు,ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
Recommended Video
శాటిలైట్ చిత్రాల్లో ఏముంది...
తాజాగా వెలుగుచూసిన శాటిలైట్ చిత్రాల్లో ప్యాట్రోల్ ఫింగర్ పాయింట్ 14 వద్ద చైనా ఆర్మీ స్థావరాలు కనిపిస్తున్నాయి. ఎల్ఏసీకి దారితీసే రాక్ ఫేస్ వెంబడి కూడా చైనా శిబిరాలు ఉన్నట్టుగా అందులో స్పష్టమవుతోంది. నిజానికి జూన్ 16 ముందు వరకూ ఇవేవీ అక్కడ లేదు.దీనిపై ఆర్మీ మేజర్ జనరల్ రమేష్ పాంది మాట్లాడుతూ.. 'ప్యాట్రోల్ పాయింట్ 14వదద్ చొరబాటుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎల్ఏసీకి మనవైపున ఇవి చైనా రక్షణాత్మకంగా నిర్మించుకున్న స్థావరాలుగా కనిపిస్తున్నాయి.' అని పేర్కొన్నారు.
ఆర్మీ అధికారులు ఏమంటున్నారు...
రిటైర్డ్ అడిషనల్ సర్వేయర్ ఒకరు దీనిపై మాట్లాడుతూ... శాటిలైట్ చిత్రాల్లో భారీ వాహనాల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. దీన్నిబట్టి ఆ ప్రాంతంలో సైన్యం మోహరింపే చైనా ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. గాల్వన్ వ్యాలీలో చైనా ఆర్మీ కల్వర్ట్ నిర్మిస్తున్న చిత్రాలు కూడా శాటిలైట్ ద్వారా వెలుగుచూశాయి. వాస్తవాధీన రేఖ నుంచి కి.మీ కన్నా తక్కువ దూరంలో ఉన్న గాల్వన్ నదిపై ఈ కల్వర్టును నిర్మించారు.
దౌలత్ బేగ్,డెప్సంగ్లో పీఎల్ఏ మోహరింపు
ఇటీవలే లేహ్ నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్కు రోడ్డు నిర్మాణం చాలావరకు పూర్తి కావొచ్చిన సందర్భంలో భారత్-చైనా మధ్య జూన్ 15న ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 20 మంది భారత సైన్యం,40 మంది చైనా సైనికులు మృతి చెందారు. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకే చైనా ఈ కుట్రకు తెరలేపిందన్న అనుమానాలున్నాయి. తాజాగా మరోసారి దౌలత్ బేగ్ ఓల్డీ(DBO) డెప్సంగ్ సెక్టార్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని చైనా మోహరించినట్టుగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. అంటే,చైనా ఈ రెండు సెక్టార్లలో మున్ముందు కవ్వింపు చర్యలకు పాల్పడబోతుందా అన్న చర్చ జరుగుతోంది.
మింగుడుపడని పరిణామాలు...
తూర్పు లదాఖ్లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా సైన్యం ఉపసంహరణపై భారత్ ఆశాభావ దృక్పథంతో ఉన్న సమయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు మన దేశానికి మింగుడుపడనివేనని చెప్పాలి. గాల్వన్ వ్యాలీలో చైనా నిర్మాణాలను కొనసాగిస్తున్నట్టుగా వెలుగుచూసిన శాటిలైట్ చిత్రాలపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక జూన్ 15 నాటి ఘర్షణలకు సంబంధించి చైనా సైనికులు 40 మంది చనిపోయారని భారత్ చెప్పినప్పటికీ.. ఆ దేశం మాత్రం అదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. చైనా విదేశాంగ మంత్రి జావ్ లిజియన్ స్వయంగా దీన్ని ఖండించారు. ఇలా విరుద్ద ప్రకటనలు,విరుద్ద వ్యవహారాలతో రెండు దేశాల మధ్య మున్ముందు సరిహద్దులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.