భారత సాయాన్ని కావాలనే అడ్డుకుంటున్న చైనా: అక్కడి భారతీయులను తీసుకురాలేని పరిస్థితి
న్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి అల్లాడిపోతున్న ప్రజలకు సాయం అందించాలనే మంచి ఉద్దేశంతో భారత్ ముందుకొచ్చినప్పటికీ.. చైనా మాత్రం ఆ సాయాన్ని అందుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. కరోనావైరస్ బారిన పడిన బాధితుల వైద్యసాయం నిమిత్తం ఓ సహాయక విమానాన్ని వుహాన్కు పంపించేందుకు భారత్కు చైనా ఇంకా అనుమతివ్వడం లేదు.

సహాయక విమానానికి క్లియరెన్స్ ఇవ్వని చైనా..
ఆ విమానానికి క్లియరెన్స్ ఇవ్వడంలో చైనా కావాలనే ఆలస్యం చేస్తోందని భారత అధికార వర్గాలు చెబుతున్నాయి. కరోనావైరస్పై పోరాడేందుకు తమ వంతు సాయం అందిస్తామని, ఇందులో భాగంగా వైద్య సామాగ్రితో ఉన్న ఓ సహాయక విమానాన్ని వుహాన్ నగరానికి పంపుతామని భారత సర్కారు ఇటీవల ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చైనా అనుమతిస్తే వైద్య సాయం చేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని భారత్ భావించింది.

20నే వెళ్లాల్సి ఉండగా..
భారత ప్రభుత్వం చైనాకు పంపే విమానాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్నప్పటికీ.. చైనా నుంచి మాత్రం క్లియరెన్స్ రాలేదు. ఫిబ్రవరి 20న ఈ సహాయక విమానం ఢిల్లీ నుంచి వుహాన్ నగరానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. చైనా ఇంకా అనుమతి ఇవ్వకపోవడంపై భారత అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సాయంగా అత్యవసర వస్తువులు
కరోనా కష్టాల్లో చైనాకు సాయం చేయాలని భారత్ భావిస్తుంటే.. ఆ దేశం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గ్లౌజులు, సర్జికల్ మాస్కులు, ఫీడింగ్ పంపులు తదితర అత్యవసర వస్తువులను సహాయ విమానాల్లో పంపాలని భావించామని చెబుతున్నారు. ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి సహాయక విమానాలను అనుమతిస్తున్న చైనా.. భారత్ సాయాన్ని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని అంటున్నారు.

చైనా అడ్డుపడటంతో అక్కడి భారతీయులు అక్కడే..
ఈ నేపథ్యంలోనే చైనాపై అధికారులు మండిపడుతున్నారు. భారత్ సాయాన్ని తీసుకునే ఆలోచనలో లేదా? వుహాన్లో ఉన్న భారతీయులను తీసుకెళ్లే విషయంలో చైనా ఎందుకు అడ్డుపడుతోందని నిలదీశారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని చెబుతున్న చైనా.. అనుమతి మాత్రం ఇవ్వకపోడం గమనార్హం. దీంతో చైనాలో ఉన్న భారతీయులు స్వదేశానికి రావడం ఆలస్యమవుతోంది. కాగా, చైనాలో ఇప్పటికే 2300 మంది కరోనావైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో లక్ష మంది వరకు కరోనా బాధితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications