చైనా తోకా వంకరే: సరిహద్దులో ఉపసంహరణ అని, ఎల్ఏసీ వెంబడే డ్రాగన్ బలగాల తిష్ట
న్యూఢిల్లీ: సరిహద్దులో శాంతియుత వాతావరణ నెలకొల్పేందుకు భారత్-చైనా దేశాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాలకు సంబంధించిన బలగాలను ఇటీవలే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, జిత్తులమారి చైనా మాత్రం అలా వెనక్కి తగ్గినట్లే కనిపించినా.. తమ బలగాలను పలు ప్రాంతాల నుంచి ఉపసంహరించుకోలేదని అమెరికాకు చెందిన మిలిటరీ కమాండర్ వెల్లడించడం గమనార్హం.
భారత్ను అప్రమత్తం చేస్తున్న అమెరికా..
ఇండో-పసిఫిక్ పరిస్థితులను పరిశీలించే యూఎస్ మిలిటరీ అడ్మిరల్ ఫిలిప్ ఎస్. డేవిడ్సన్ చట్ట సభ్యులతో మాట్లాడుతూ.. సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్కు అన్ని విధాలుగా అమెరికా అండగా ఉందని, సరిహద్దులో పరిస్థితులను వివరించామని, చలిని తట్టుకునే విధంగా బట్టలు, ఇతర పరికరాలను అందజేశామని తెలిపారు. సరిహద్దులో చైనా కార్యకలాపాలకు సంబంధించి భారత్ను తరచూ అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. గత సంవత్సరం గల్వాన్ లోయలో చైనా-భారత్ ఘర్షణలో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగిన తర్వాత భారత్కు సరిహద్దు పరిస్థితులపై, చైనా కార్యకలాపాలపై అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
పలు ప్రాంతాల్లో తిష్ట వేసిన చైనా బలగాలు
ఫిబ్రవరి నెలాఖరు నాటికి భారత్, చైనాలు లడఖ్ సరిహద్దు వెంబడి, ప్యాంగాంగ్ త్సో ప్రాంతాల నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే, వెనక్కి తగ్గినట్లే కనిపించినా.. డ్రాగన్ సైనికులు మళ్లీ సరిహద్దుల వెంబడి కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా కమాండర్ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి మరోసారి తమ బలగాలను భారీ ఎత్తున తరలించేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక, పలు వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో నిర్మాణాలను కూడా చేపడుతోందని వెల్లడించారు. ఈ విషయంలో భారత్ కూడా అప్రమత్తంగానే వ్యవహరిస్తోందన్నారు. చైనా కుట్రలను పసిగట్టి తగిన రీతిలో భారత్ స్పందిస్తుందని అనుకుంటున్నట్లు యూఎస్ కమాండర్ తెలిపారు.
భారత్తో అమెరికా సత్ససంబంధాలు..
చైనా దురాక్రమణలకు కళ్లెం వేసేందుకు యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. కాగా, భారత్తో అమెరికా మిలిటరీ ప్రస్తుతం మంచి సంబంధాలను కొనసాగిస్తోందని వెల్లడించారు. అమెరికా-భారత్ దేశాల మధ్య సత్ససంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. బరాక్ ఒబామా చెప్పినట్లు ఈ రెండు దేశాల మధ్య 21వ శతాబ్ధంలో మంచి సంబంధాలుంటాయన్నారు. ఇటీవల భారత్-అమెరికాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయన్నారు. మిలిటరీ సహకారం, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, సంయుక్త కార్యకలాపాలు లాంటివి వీటిలో ఉన్నాయన్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మకంగా అత్యవసరమని వ్యాఖ్యానించారు.