భారత్పై యుద్ధానికి సిద్ధపడుతున్న చైనా- బాంబు పేల్చిన రాహుల్..!!
జైపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 98వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రాజస్థాన్లో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారాయన. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్కు చేరుకుంది. దీని తరువాత హర్యానాలో అడుగు పెట్టనున్నారు రాహుల్ గాంధీ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లో ఈ యాత్ర ముగియాల్సి ఉంది.
ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ బుజ్జగింపు- అర్జంట్ ఫోన్ కాల్
రాజస్థాన్లో..
ఈ తెల్లవారు జామున 6 గంటలకు రాజస్థాన్ దౌసాలో భారత్ జోడో యాత్రను మొదలు పెట్టారు రాహుల్ గాంధీ. ఇవ్వాళ్టితో ఈ యాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. జోడో యాత్ర సందర్భంగా దౌసా పట్టణం మొత్తం జనమయమైంది. ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు కనిపించాయి.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..
ఇవ్వాళ్టి యాత్ర ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత భూభాగంపైకి చైనా సైనికులు చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన విషయంపైనా రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటోన్నాయని, దీన్ని కేంద్రం పట్టించుకోవట్లేదనీ విమర్శించారు.
భారత్తో యుద్ధానికి..
తనకు ఉన్న సమాచారం మేరకు భారత్తో యుద్ధం చేయడానికి చైనా పూర్తిగా సన్నాహాలు చేస్తోందని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఓ స్పష్టమైన అభిప్రాయంతో చైనా ఉందని వివరించారు. చైనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ- దాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ యుద్ధ ముప్పును దాచి పెట్టలేమని వ్యాఖ్యానించారు.
అరుణాచల్ ప్రదేశ్ టార్గెట్..
అరుణాచల్ ప్రదేశ్ వైపు నుంచి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు పూర్తిస్థాయిలో దాడులకు సన్నద్ధమౌతోన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందులో భాగంగానే తవాంగ్ సెక్టార్లో తాజా ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఇంతా జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిద్రావస్థలో ఉందని ధ్వజమెత్తారు.
వినడానికీ అంగీకరించట్లేదు..
చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా యుద్ధానికి దిగబోతోందనే సమాచారాన్ని వినడానికి కూడా ఇష్టపడట్లేదని అన్నారు. భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించడం కాదని.. నేరుగా యుద్ధానికి దిగడానికే చైనా రంగం సిద్ధం చేసుకుంటోందనీ ఆయన వివరించారు. సరిహద్దులు, వాస్తవాధీన రేఖ వద్ద చైనా తన సైన్యాన్ని, యుద్ధ సామాగ్రిని మోహరింపజేస్తోండటాన్ని బట్టి చూసినా ఇది అర్థమౌతుందని అన్నారు.
ఈవెంట్ ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం ఈవెంట్ సర్కార్గా మారిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వ్యూహాత్మకంగా శతృవును దెబ్బకొట్టడానికి బదులుగా ఈవెంట్ కార్యక్రమాలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఈవెంట్లను నిర్వహించడం వల్ల యుద్ధ భయాలు తొలగిపోవని, అందుకు సమర్థవంతమైన విదేశీ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.