మోదీ మాటల తూటాలకు చైనా విలవిల.. విస్తరణవాదులం కాదంటూ వివరణ..
ఉన్న మాటన్న ప్రతిసారి ఉలిక్కిపడటం చైనాకు అలవాటు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ప్రయోగించిన 'విస్తరణవాదం' తూటా సైతం డ్రాగన్ కు బలంగానే గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం లడాక్ లో ఆకస్మికంగా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిని రివ్యూ చేశారు. నిమూ సెక్టార్ లో సైనిక, వాయుసేన, ఐటీబీపీ బలగాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనాను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం పేరును ప్రస్తావించకపోయినా.. గంటల వ్యవధిలోనే చైనా రియాక్ట్ అయింది.
సరిహద్దును పంచుకునే అన్ని దేశాల భూభాగాలనూ కబ్జా చేయడం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతా కలిపి సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల ఇతరుల భూమిని డ్రాగన్ ఆక్రమించడం తెలిసిందే. శుక్రవారం నాటి లదాక్ ప్రసంగంలో ప్రధాని మోదీ.. చైనా 'విస్తరణవాదాన్ని' ఎత్తిచూపారు. లదాక్ ఇండియాకు శిరస్సు లాంటిదని, దాన్ని కాపాడుకునే విషయంలో రాజీపడబోమని అన్నారు. ఇంకా, '' విస్తరణవాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి శకం. విస్తరణ శక్తులకు ఓటమి తప్పదని చరిత్ర రుజువుచేసింది..''అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీలోని చైనా ఎంబసీ స్పందించింది. చైనాను విస్తరణవాదిగా పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. తాము ఎలాంటివాళ్లమో వివరించే ప్రయత్నం చేసింది. ''చైనాకు 14 దేశాలతో సరిహద్దు సంబంధాలున్నాయి. అందులో 12 దేశాలతో సమస్యలను శాంతియుతంగానే పరిష్కరించుకున్నాం. సరిహద్దులో స్నేహపూర్వక, సహకారాత్మక బంధానికే చైనా ప్రాధాన్యం ఇస్తుంది. అలాంటి మమ్మల్ని 'విస్తరణవాది' అనడం కచ్చితంగా అర్థంలేని ఆరోపణే అవుతుంది'' అని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జిన్ రోంగ్ వివరణ ఇచ్చారు.
భారత్ లోని చైనా ఎంబసీ కంటే ముందే, చైనా విదేశాంగ శాఖ.. భారత ప్రధాని లదాక్ పర్యటనపై స్పందించింది. రెండు దేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని నివారించడానికి సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో కీలక ప్రాంతాల్లో పర్యటించి, ఉద్రిక్తతల్ని మరింతగా పెంచే ప్రయత్నాలు తగదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. మొత్తానికి లదాక్ లో మోదీ ఆకస్మిక పర్యటనతో చైనాకు బాగానే సెగ తగిలినట్లు అది చేస్తోన్న ప్రకటనలతో అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications