చైనా సైన్యంలో మిలీషియా దళం: మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో దాడులు: ఎదిరించే సత్తా లేక.. వెనుకనుంచి
న్యూఢిల్లీ: భారత్తో సరిహద్దు వివాదాలను యుద్ధం వరకూ తీసుకెళ్తోన్న దిశగా చైనా.. మరో దుస్సాహసానికి పూనుకుంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధవిమానాలు, హెలికాప్టర్ కార్యకలాపాలను విస్తృతం చేసిన డ్రాగన్ కంట్రీ తాజాగా.. సరిహద్దు బలగాల్లో భారీ మార్పులు చేర్పులను తీసుకొచ్చింది. కొత్త బలగాలను మోహరింపజేసింది. ఇందులో పర్వతారోధకులు, మార్షల్ ఆర్ట్స్లో నిపుణులను చేర్చింది. వారి కోసం ప్రత్యేకంగా మిలీషియా డివిజన్ను ఏర్పాటు చేసిందని, కొత్త నియామకాలను కూడా చేపట్టిందని చైనీస్ మీడియా చెబుతోంది.
మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో దాడులు..
అణ్వాయుధాలను కలిగిన భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలకు సంబంధించిన సరికొత్త విషయాలను చైనీస్ మీడియా రోజుకొక్కటి చొప్పున వెల్లడిస్తోంది. తాజాగా మరో దిగ్భ్రాంతికర విషయాలను బహిర్గతం చేసింది. ఈ నెల 16వ తేదీన వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో మార్షల్ ఆర్ట్స్ నిపుణులు పాల్గొన్నట్లు స్పష్టమైంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన నిపుణులతో భారత జవాన్లపై దాడులకు పాల్పడినట్లు చైనా మీడియా వెల్లడించింది.
పర్వతారోధకులు, మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో ప్రత్యేకంగా..
దీనిపై చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అత్యంత ప్రమాదకరంగా భావించే మిలీషియా డివిజన్ను ఈ నెల 15వ తేదీన సరిహద్దులకు తరలించినట్లు ఈ కథనంలో పేర్కొంది. మౌంట్ ఎవరెస్ట్ ఒలింపిక్ టార్చ్ రిలే టీమ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్లబ్ సభ్యులతో ప్రత్యేకంగా ఓ మిలీషియా టీమ్ను తయారు చేసిందని, భారత జవాన్లపై దాడులకు పాల్పడింది ఈ గ్రూప్ సభ్యులేనని ఈ కథనం వెల్లడించింది. లాసా కేంద్రంగా కొత్త నియామకాలను కూడా చేపట్టినట్లు స్పష్టం చేసింది.
మిలీషియా డివిజన్..
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని మరింత బలోపేతం చేయడానికి, దానికి అనుబంధంగా పనిచేస్తున్నట్లుగా అనుమానిస్తోన్న ఎండో ఫైట్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తగా నియామకాలను కూడా చేపట్టారని పేర్కొంది. ఇందులో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన నిపుణులకు ప్రాధాన్యత ఇస్తోందని నేషనల్ డిఫెన్స్ న్యూస్ స్పష్టం చేసింది. టిబెట్ కమాండర్ వాంగ్ హైజియాంగ్ పేరును ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. భారత్తో సరిహద్దు వివాదాలు, ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో కొత్త నియామకాల్లో మార్షల్ ఆర్ట్స్ నిపుణులు, పర్వాతారోహకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైందని అభిప్రాయపడింది.
ప్రాణాంతక దాడుల తరువాత..
ఈ నెల 16వ తేదీన వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో రెండు దేశాల తరఫున 65 మందికి పైగా జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. భారత్తో పోల్చుకుంటే.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారీగా ప్రాణనష్టాన్ని చవి చూసిందంటూ వార్తలు వెలువడ్డాయి. భారత్ వైపు కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులు కాగా.. పీఎల్ఏ తరఫున 45 మందికి పైగా సైనికులు చనిపోయినట్లే తేలింది.
మోహరింపులకు తోడుగా..
ఈ ప్రాణాంతక దాడుల అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రక్తి పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ప్రతిరోజూ తమ సైనిక బలగాలను పెంచుకుంటోనే పోతున్నాయి. చైనా అత్యుత్తమ హెలికాప్టర్లను మోహరింపజేసింది. భారత్ తన అమ్ములపొదిలోని అధునాతన విమాన విధ్వంసక వ్యవస్థను తూర్పు లఢక్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
లఢక్ తూర్పు సెక్టార్లో ఉద్రిక్తత..
భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులతో కూడిన ఈ క్విక్-రియాక్షన్ మిస్సైళ్లను లఢక్ తూర్పు సెక్టార్లో మోహరింపజేసింది. భారత్, చైనా రెండూ దేనికవి తీసిపోవట్లేదు. ఫలితంగా- ఈ రెండు దేశాల మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులు.. వాతావరణం మరింత సంక్లిష్టంగా మారిపోయాయి. రోజురోజుకూ యుద్ధం వైపు అడుగులు పడుతూనే వస్తున్నాయి. రెండు దశల్లో చర్చలు సాగినప్పటికీ.. ఆశించదగ్గ ఫలితాలు రాలేదని, దానికి నిదర్శనమే ఈ మోహరింపులని చెబుతున్నారు.