ఆరేళ్ల తర్వాత.. చైనాలోని ఆ సిటీకి భారత్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్
ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సమ్మిట్ నేడు ఆరంభం కాబోతోంది. ఈ సమ్మిట్ సైడ్ లైన్స్ లో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముఖాముఖి భేటీ అయ్యారు. నేడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం భారత్ మండపంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది. ఆసియాలో అత్యంత శక్తిమంతమైన ఈ రెండుదేశాల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలకు రంగం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో.. భారత్- చైనా మధ్య స్తంభించిపోయిన పౌర విమానయాన రంగానికి పునరుజ్జీవం లభిస్తోంది. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం.. చైనాకు చెందిన ప్రముఖ పౌర విమానయాన సంస్థ చైనా సదరన్ ఎయిర్లైన్స్ భారత్ కు తన విమాన సర్వీసులను పునరుద్ధరించింది. గ్వాంగ్ఝౌ నుంచి నేరుగా ఢిల్లీకి విమాన సర్వీసులను పునఃప్రారంభించబోతోంది. ఈ నెల 21వ తేదీన మొదటి విమానం గ్వాంగ్ఝౌ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది.

ఈ నిర్ణయంతో.. ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరవుతున్న తరుణంలో ఈ కీలక ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సిక్కిం సమీపంలోని డోక్లామ్, లఢక్ వద్ద గాల్వాన్ వ్యాలీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా భారత్- చైనా మధ్య నడిచే ప్రధాన విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. అనేక దౌత్యపరమైన చర్చల ఫలితంగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విమాన ప్రయాణ సర్వీసులపై ఆంక్షలను సడలించింది. ఈ నేపథ్యంలో చైనా సదరన్ సంస్థ దక్షిణాసియావ్యాప్తంగా ఎనిమిది రౌండ్ ట్రిప్ మార్గాల్లో వారానికి ఏకంగా 100కు పైగా విమానాలను నడిపేలా తన నెట్వర్క్ను పునర్వ్యవస్థీకరిస్తోంది.
భారత్-చైనా మధ్య విమాన రాకపోకల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. మొదటగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా భారత్ నుండి చైనాకు విమానాలను పునరుద్ధరించింది. దీని తర్వాత ఏప్రిల్లో ఎయిర్ చైనా సైతం బీజింగ్-ఢిల్లీ మార్గంలో తన ప్రయాణ సేవలు పునఃప్రారంభించింది. వీటితో పాటు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ కోల్కతా-కున్మింగ్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో ఇండిగో కూడా కోల్కతా-షాంఘై మధ్య నేరుగా నడిచే రోజువారీ విమానాలను నడిపిస్తోంది.














Click it and Unblock the Notifications
