ప్యాంగాంగ్ సరస్సు నుంచి చైనా ట్యాంకులు, ఆయుధ వాహనాలు వెనక్కి
న్యూఢిల్లీ/బీజింగ్: గత కొంత కాలంగా భారత్-చైనా సరిహద్దల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి తెరదించుతూ ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యాయి. సరిహద్దులో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఈ క్రమంలో గురువారం బలగాల ఉపసంహరణలో భాగంగా ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతాల నుంచి భారత్, చైనా తమ బలగాలను వెనక్కి రప్పించుకున్నాయి. ట్యాంకులు, ఇన్ఫాంట్రీ కంబాట్ వాహనాలు వెనక్కి వెళ్లిపోయాయి.

తొలి దశ బలగాల ఉపసంహరణలో భాగంగా న్యోమా నుంచి భారత బలగాలు వెనక్కి రాగా, సిరిజప్, మోల్దో గారిసన్ ప్రాంతాల నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లాయి. ప్యాంగాంగ్ సరస్సుకు ఇరువైపుల బలగాలను ఉపసంహరించుకున్నాయి. వారం రోజుల్లోగా మొత్తం బలగాల ఉపసంహరణ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపారు.
తొలి దశ బలగాల ఉపసంహరణ ప్రారంభమైన నేపథ్యంలో ఇరు దేశాలు కూడా ఇతర ప్రాంతాల్లోని బలగాలను వెనక్కి రప్పించేందుకు చర్చలు ప్రారంభించాయి. ప్యట్రోలింగ్ పాయింట్ 17, పీపీ-15 ప్రాంతాల నుంచి కూడా బలగాలను వెనక్కి తీసుకోవాల్సి ఉంది.
ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఇరు దేశాల ఆర్మీ అధికారులు హాట్ లైన్ ద్వారా, ఛుషుల్ ప్రాంతంలో భౌతికంగానూ చర్చలు జరిపిన నేపథ్యంలో తాజా పరిస్థితులకు నెలకొన్నాయి. గత ఆగస్టులో ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని రెజాంగ్ లా, రెచెన్ లా ప్రదేశాలను భారత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను కూడా ఖాళీ చేసే అవకాశం ఉంది.
బలగాల ఉపసంహరణ అనేది ఇరుదేశాల మధ్య సమ్మతంతో జరుగుతున్నదేనని, అంతకుమించి ఏమీ లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం పార్లమెంటు సమావేశాల్లో తెలిపారు. అయితే, చైనాతో భారత్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, చైనా చెప్పినట్లు నడుచుకునేదే లేదని స్పష్టం చేశారు.
కాగా, ఫింగర్ 3 సమీపంలో ఉన్న ధన్ సింగ్ థాపా పోస్టుకు భారత్ వెళ్లాల్సి ఉండగా, చైనీయులు ఫింగర్ 8కి తూర్పు వైపు కదులుతారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో రెండు దేశాలు 50,000 మంది సైనికులను పరస్పరం మోహరించాయి.












Click it and Unblock the Notifications