చైనా మరో దుస్సాహసం-ఈసారి ఉత్తరాఖండ్ లో చొరబాటు-ఏకంగా 100 దళాలు, గుర్రాలతో
భారత్, చైనా మధ్య తూర్పు లడఖ్ లో మొదలైన సరిహద్దు ఘర్షణ ఇంకా సమసి పోలేదు. అప్పుడే మరోసారి చైనా దుస్సాహసానికి దిగినట్లు అర్ధమవుతోంది. పైకి భారత్ తో సంబంధాలు కోరుకుంటున్నట్లు నటిస్తూ, చర్చలు కూడా జరుపుతున్న డ్రాగన్ దేశం .. మరోవైపు రహస్యంగా మన దేశంలోకి తమ సైన్యాన్ని పంపినట్లు ఆలస్యంగా వెలుగుచూసిన నివేదికలు చెప్తున్నాయి.
Recommended Video
ఉత్తరాఖండ్ లోని బర్హోతీలో ఉన్న భారత్-చైనా సరిహద్దుల ద్వారా దాదాపు 100 దళాల చైనా లిబరేషన్ ఆర్మీ బలగాలు గత నెల 30న చొరబడినట్లు తాజాగా వెలుగుచూసిన నివేదికలు చెప్తున్నాయి. గుర్రాలపై వచ్చిన చైనా బలగాలు.. మూడు గంటల పాటు బర్హోతీలో చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. బర్హోతీలో ఉన్న కాలి నడక వంతెనను చైనా బలగాలు కూల్చేశాయని, కానీ భారత బలగాలతో ముఖాముఖీ మాత్రం ఎదురుపడలేదని సమాచారం. విషయం తెలిసి ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ ఐటీబీపీతో పాటు మన సైనికులు అక్కడికి చేరుకునే సమయానికి చైనా బలగాలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ లోకి చైనా సైనికుల చొరబాటుపై తమకు ఎలాంటి సమాచారం లేదని అక్కడి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్తున్నారు. ఇప్పటికే తూర్పు లఢక్ లో పరిస్ధితులు పూర్తిగా భారత్ నియంత్రణలోకి రాలేదు. ఆ లోపే ఉత్తరాఖండ్ లో చైనా సైనికుల చొరబాటు వార్తలు కలకలం రేపుతున్నాయి. కేంద్రం కానీ, సైన్యం కానీ ఈ వార్తల్ని నిర్ధారించడం లేదు. దేశ భద్రతకు సంబంధించిన సున్నిత అంశం కావడంతో ఈ వ్యవహారాన్ని అంతా రహస్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిఘా వర్గాల సమాచారం మేరకు తూర్పు లడఖ్ లో సైతం చైనా బలగాలు తాజాగా గుడారాలు నిర్మిస్తున్నట్లు అర్ధమవుతోంది.
తూర్పు లడఖ్ లో భారత్, చైనా చెరో 50 వేల మంది వరకూ బలగాలతో పాటు యుద్ధ ట్యాంకులు, మిసైళ్లను కూడా అందుబాటులో ఉంచుకున్నాయి. ఎలాంటి పరిస్ధితుల్ని అయినా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ మోహరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మిలటరీ స్ధాయిలో పలుమార్లు భారత్-చైనా చర్చలు జరిగినా ఈ మోహరింపులు మాత్రం ఎక్కడా వెనక్కితగ్గకపోవడం విశేషం. దీంతో తూర్పు లడఖ్ లో పరిస్ధితులపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఉత్తరాఖండ్ చొరబాటు వార్తలు మరింత కలకలం రేపేలా ఉన్నాయి.
గతేడాది మే నెలలో గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ప్యాంగ్ యాంగ్ సరస్సుతో పాటు గోగ్రా ప్రాంతాల్లో ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. తిరిగి ఇప్పుడు మళ్లీ పాగా వేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం భారత్ కు ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి శీతాకాలం నేపథ్యంలో హిమాలయాల్లో పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని భారత్, చైనా , పాకిస్తాన్ బలగాల ఉపసంహరణలు ఉంటాయి. కానీ ప్రస్తుతం చైనా దూకుడు కొనసాగిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.