చైనా..తప్పు చేయలేదంటూ తప్పించుకునే యత్నం: వాస్తవాధీన రేఖ దాటలేదట: ఝావో లీజియన్
బీజింగ్: లఢక్ సమీపంలోని భారత్, చైనా వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ వాతావరణం పట్ల చైనా స్పందించింది. పంగ్యాంగ్ త్సొ లేక్ ప్రాంతంలో సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనా బలగాలను భారత జవాన్లు నిలువరించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని పేర్కొంది. తమ దేశ సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని, ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారనడం సరికాదని స్పష్టం చేసింది.
భారత జవాన్లతో తాజా ఘర్షణల వెనుక చైనా మాస్టర్ ప్లాన్: ఫిఫ్త్ జనరేషన్ అల్ట్రా మోడర్న్ ఫైటర్స్
వాస్తవాధీన రేఖను దాట లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝవో లీజియన్ తెలిపారు. చైనా రాజధాని బీజింగ్లో ఆయన పేరు మీద ఓ ప్రకటన విడదలైంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖను దాటే ప్రయత్నించగా.. భారత జవాన్లు అడ్డుకున్నారంటూ వార్తలు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. తమ సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకునే ప్రయత్నం చేశారనడంలో సహేతుకం కాదని ఝవో లీజియన్ పేర్కొన్నారు.
ఎలాంటి ఉల్లంఘటనలకు గానీ, రెచ్చగొట్టే ప్రయత్నాలకు గానీ పాల్పడలేదనే పక్కా సమాచారం తన వద్ద ఉందని అన్నారు. ఈ విషయంలో భారత ఆర్మీ అధికారులు చేసిన ప్రకటనను లీజియన్ తోసిపుచ్చారు. తాము స్ట్రిక్ట్గా ఎల్ఏసీకి మాత్రమే పరిమితం అయ్యామని, దాన్ని దాటే ప్రయత్నం చేయలేదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి రెండు వైపులా ప్రయత్నాలు సాగుతున్నాయని, అవి ఫలిస్తాయనే సానుకూల దృక్పథంతో తాము ఉన్నామని ఝావో లీజియన్ వెల్లడించారు.
Recommended Video
రక్షణపరంగా, దౌత్యపరంగా సరిహద్దు వివాదాలను శాంతియుత వాతావరణంలో పరిష్కార మార్గాలను కనుగొనడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే పలుమార్లు లెప్టినెంట్ కమాండర్ స్థాయి సమావేశాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఆ చర్చల ద్వారా సాధించిన పురోగతి గురించి తాము ఇప్పుడిప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని చెప్పారు. ఏదైనా పురోగతి కనిపిస్తే.. తప్పకుండా వెల్లడిస్తామని అన్నారు.