'ప్రత్యేక' ఖైదీగా గుర్తించండి: ప్లాన్ మార్చి.. శశికళ 'ఏ' క్లాస్ వ్యూహం?
పరప్పన అగ్రహార జైలులో తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అన్నాడీఎంకే అధినేత్రి శశికళ బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో లొంగిపోయేందుకు ఆమె చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరారు.
బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అన్నాడీఎంకే అధినేత్రి శశికళ బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో లొంగిపోయేందుకు ఆమె చెన్నై నుంచి బెంగళూరు బయలుదేరారు. అనంతరం లొంగిపోయారు.
శశికళ రాక నేపథ్యంలో జైలు వద్ద 144వ సెక్షన్ విధఇంచారు. శశికళ కోసం జైలు హాలును సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. జడ్జి అశ్వత నారాయణ మూడు గంటలకు కోర్టుకు రానున్నారు.
అంతకుముందు, తన నివాసం వేద నిలయం నుంచి బెంగళూరుకు ఆమె రోడ్డు మార్గంలో బయలుదేరారు. మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించి... అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.

ప్రత్యేక ఖైదీ అంటే.. జైలులో శశికళకు ఫ్యాన్, మినరల్ వాటర్, హెల్పర్ను ఇస్తారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు. అంతకుముందే, శశికళ జైలుకు కోరికల చిట్టా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తనకు షుగర్ ఉందని, ఇంటి భోజనం తెప్పించకుంటానని, అలాగే ప్రత్యేక గది, మంచం, టీవీ కావాలని, సహాయకుడిని ఇవ్వాలని కోరింది. రోజూ మినరల్ వాటర్ అడిగారు.
జైలు శిక్ష తప్పదని సిద్ధమయ్యారా?
జైలు శిక్ష ఎటూ తప్పదని శశికళ ముందే సిద్ధమయ్యారా? ఆమెకు ముందస్తుగానే సంకేతాలు అందాయా? మూడు రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలను పరిశీలించినప్పుడు ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించిన శశికళ ముఖ్యమంత్రి హోదా సాధించాక వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె చర్యల ఆధారంగా విశ్లేషిస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నాక రాజీనామా చేసినా కారాగారంలో వీఐపీ ఖైదీగా ఉండవచ్చన్నది వ్యూహం కావొచ్చని చెబుతున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో మూడు రోజులుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ మాత్రం జైలు శిక్ష అంశం కన్నా ముఖ్యమంత్రి హోదా పైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
పన్నీరు ఎదురుతిరగటంతో పరిస్థితి మలుపు తిరిగింది. మరోవైపు గవర్నర్ వేచి చూసే ధోరణిని అవలంబించారు. తీర్పు నేపథ్యంలోనే గవర్నరు జాప్యం చేస్తున్నారన్న అంశంపై స్పష్టత వచ్చాక ఇక ముఖ్యమంత్రి పదవి ఇప్పట్లో చేపట్టడం అసాధ్యమని గ్రహించి శశికళ వ్యూహాన్ని మార్చారని అంటున్నారు.
తాను కారాగారంలో ఉన్నా భవిష్యత్తు ప్రణాళికలు రచించాలన్న లక్ష్యంగానే శశికళ మూడు రోజులుగా శాసనసభ్యులతో ప్రతీరోజు మంతనాల్లో మునిగారు. ముఖ్యంగా తీర్పుకు ఒకరోజు ముందు ఆమె సోమవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
తన పరోక్షంలోనూ పార్టీయే అధికారంలో ఉండాలని, ఎమ్మెల్యేల్లో ఐక్యత కొనసాగాలని దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. తీర్పు ప్రతికూలంగా వస్తే ఎమ్మెల్యేలు ఉంటున్న రిసార్ట్స్ నుంచే కారాగారానికి వెళ్లాలని భావించి సోమవారం రాత్రి అక్కడే బస చేశారంటున్నారు.
కాగా, శిక్ష పడినా వీఐపీ ఖైదీగా గుర్తించే విషయంపై పార్టీ నేతలు ముందే ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి హోదా దక్కకుండానే కారాగారానికి వెళితే 'ఎ' క్లాస్ ఖైదీగా గుర్తించాలని కోర్టులో పిటిషన్ వేయాలని పార్టీ నేతలు ముందుగానే నిర్ణయించారంటున్నారు.
ముఖ్యమంత్రి కాకపోయినా.. శశికళ ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. శాసనసభపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ అంశాల ఆధారంగా న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయాలని కూడా భావించారట.
ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రత్యేక హోదా కలిగిన వారికి కారాగారాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. 'ఎ' క్లాస్ ఖైదీగా గుర్తిస్తారు. వీరికి ప్రత్యేకంగా గదిని కేటాయించడంతోపాటు నిద్రించేందుకు మంచం, పరుపు, దిండు కేటాయిస్తారు. దోమతెర, వార్తాపత్రిక, రేడియో ఇస్తారు. వారంలో రెండుసార్లు ఇంటి నుంచి మాంసాహార భోజనం తెప్పించుకోవచ్చు.












Click it and Unblock the Notifications