చిరుకు ప్రతిష్టాత్మక అవార్డు, థాంక్స్ చెప్పిన మెగాస్టార్, పవన్ అభినందనలు
మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు దక్కింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చలనచిత్రోత్సవం ఇవాళ (ఆదివారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో చిరంజీవి నటించారని పేర్కొంది. గోవా వేదికగా ప్రారంభమైన ఇఫీ చలన చిత్రోత్సవం ఈ నెల 28 వరకు జరగనుంది. ఇఫీ చలన చిత్రోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదరణ పొందారని, హృదయాలను కదిలించే నటనా ప్రతిభ ఆయన సొంతం అన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు.
ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి స్పందించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనను ఈ స్థాయిలో అదరించి అభిమానించిన ఫ్యాన్స్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
చిరంజీవికి అవార్డు దక్కడంపై ఆయన తమ్ముడు, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. నాలుగు దశాబ్దాలుపైగా సినీ ప్రస్థానం కొనసాగిందని తెలిపారు. తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై చిరంజీవికి ఈ గౌరవం దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు.
Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur !
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 20, 2022
My deep gratitude to Govt of India@MIB_India @IFFIGoa @Anurag_Office and all my loving fans only because of whom i am here today! https://t.co/IbgvDiyNNI