హైదరాబాద్పై సోనియాతో చిరు: జైరాంతో దామోదర
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ స్టేటస్పై, పోలవరం ముంపు ప్రాంతాలపై చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, పోలవరం ముంపు ప్రాంతాలపై సీమాంధ్రకు చెందిన కేందర్ మంత్రి చిరంజీవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవగా, జివోఎం సభ్యుడు జైరాం రమేష్తో తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనివారం చర్చలు జరిపారు.
హైదరాబాదును శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, భద్రచలాన్ని సీమాంధ్రలో కలపాలని తాను సోనియాను కోరినట్లు, సోనియా పరిశీలిస్తామని చెప్పినట్లు చిరంజీవి చెప్పారు. సోనియాతో బేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల తరఫున తాను సోనియాను కలిసినట్లు తెలిపారు. శీతాకాలం సమావేశాల్లో విభజన బిల్లును ప్రవేశపెట్టడానికి చూస్తున్న స్థితిలో చివరి ప్రయత్నంగా సోనియాను కలిసి తాను పరిస్థితిని వివరించినట్లు చిరంజీవి తెలిపారు.

హెచ్ఎండిఎ పరిధి కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటిగా) చేసే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసమే హైదరాబాద్ను యుటి చేయాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్ను యుటి చేస్తే సీమాంధ్ర ప్రజల రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము రాజీనామాలు చేసి పోరాడుతున్నామని, ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు ఉద్యోగం చేస్తూ భావోద్వేగంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తమను కించపరిస్తే సహించబోమని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై తాను మాట్లాడబోనని, ఆ విషయాన్ని రాయలసీమకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాయలసీమ ప్రజలు చూసుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నామని, తాము పాసయ్యామా, ఫెయిల్ అయ్యామా అనేది త్వరలో తేలుతుందని చిరంజీవి అన్నారు.

ఇదిలావుండగా, తెలంగాణకు చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జైరాం రమేష్తో భేటీ అయ్యారు. జీవోఎం నివేదికపై, తెలంగాణ ముసాయిదా బిల్లుపై జైరాం రమేష్ దామోదరతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ స్టేటస్పై, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై చర్చ జరిగినట్లు దామోదర రాజనర్సింహ భేటీ అనంతరం మీడియాతో చెప్పారు. రాయల తెలంగాణపై చర్చ నడుస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరగదని దామోదర అన్నారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లు ఏ విధంగా వస్తుందనే విషయంపై జైరాం రమేష్తో చర్చలు జరిగినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications