చిరు ఎఫెక్ట్, అన్నీతిరిగొచ్చి: బిజెపితోనే.. రాజశేఖర్, ట్విస్ట్
న్యూఢిల్లీ: టాలీవుడ్ హీరో రాజశేఖర్, నిర్మాత, ఆయన భార్య జీవితలు భారతీయ జనతా పార్టీలో చేరినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో పొసగక పోవడం వల్లే వారు బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా చిరంజీవి, రాజశేఖర్ దంపతుల మధ్య వైరం ఉంది.
టిడిపితో ప్రారంభించి...
తెలుగుదేశం పార్టీతో వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో వారు కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన మృతి తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కానీ, ఆయనతో పడక బయటకు వచ్చారు. తిరిగి వారు కాంగ్రెసు గూటికి చేరారు.
చిరుపై సంతృప్తి.. అసంతృప్తి
ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అప్పుడు తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. చిరుతో మొదటి నుండి వైరం ఉన్న రాజశేఖర్ దంపతులకు ఒకే పార్టీలో ఉండటం అసంతృప్తి కలిగించింది. చిరు రాకను వారు పరోక్షంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తాము కాంగ్రెసు పార్టీలోనే ఉన్నామని, చిరంజీవితో తమకు విభేదాలు లేవని చెప్పారు.
అలా చెప్పినప్పటికీ ఒకే పార్టీలో ఉండటం వారు జీర్ణించుకోలేక పోయారనే చెప్పవచ్చు. దీంతో వారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలతో చర్చలు జరిపారని, అవి వారికి సంతృప్తినివ్వలేదని వార్తలు వచ్చాయి. కొంతకాలం రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు.
అయితే, కొన్నాళ్లుగా వారు బిజెపికి దగ్గరవుతున్నారు. గుజరాత్లో సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాల నాయకులతో బిజెపి ఇటీవల హైదరాబాద్లో ఓ వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జీవిత, రాజశేఖర్ హాజరయ్యారు. అప్పటి నుంచే వారు బిజెపి వైపు మొగ్గు చూపారు.
ప్రజలు మార్పు కోరుతున్నారు
బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ను కలిసిన అనంతరం రాజశేఖర్, జీవితలు మాట్లాడుతూ... ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బిజెపి వల్లనే ఆ మార్పు సాధ్యమన్నారు. హైదరాబాదులో రాజ్నాథ్ సమక్షంలో తాము బిజెపిలో చేరుతామని చెప్పారు. ఇంకా తాము బిజెపిలో చేరలేదని, భవిష్యత్తులో చేరుతామని ట్విస్ట్ ఇచ్చారు. కాగా, మాజీ ఎంపి ఆత్మచరణ్ రెడ్డి కూడా బిజెపిలో చేరారు.