చిరంజీవి డిమాండ్కు నో: హైదరాబాద్ యుటి కాదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే చిరంజీవి, జెడి శీలం వంటి సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చినట్లే. హైదరాబాద్ను యుటిగా చేస్తే విభజనకు సహకరిస్తామని వారు చెబుతూ వచ్చారు. కానీ, హైదరాబాద్ను యుటిగా చేసే ప్రతిపాదనను జివోఎం పరిశీలించినప్పటికీ దానిపై వెనక్కి వెళ్లినట్లు చెబుతున్నారు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చకుండా ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలని జీవోఎం నిర్ణయించింది.
యూటీ కాకుండా మరో రూపంలో జీహెచ్ఎంసీ పరిధిపై కేంద్రం పరిమిత స్థాయిలో పర్యవేక్షణ ఉండేలా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకు అవసరమైన నిబంధనలను బిల్లులో చేర్చాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 119 నుంచి 153కు పెంచాలని, శాసన మండలిని కూడా ఏర్పాటు చేయాలని మర్రి శశిధర్ రెడ్డి చేసిన ప్రతిపాదనపైనా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
కాగా, డిసెంబర్ 2వ తేదీన ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్గం సమావేశమై రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలుపుతుందని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్డీ డిసెంబర్ 5వ తేదీలోపు దాన్ని శాసనసభకు పంపిస్తారని అంటున్నారు. డిసెంబర్ 2వ తేదీననాటికి మంత్రి వర్గ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.
బుధవారం ఉదయం 10 గంటలకు ఆంటోనీ నివాసంలో జీవోఎం సభ్యులు అరగంటపాటు చర్చించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు షిండే కార్యాలయంలో మూడున్నర గంటలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమావేశం నుంచి షిండే వెళ్లిపోయిన తర్వాత ఆయన కార్యాలయంలోనే జైరామ్ రమేష్ మరో రెండు గంటలు అధికారులతో చర్చలు జరిపారు. బుధవారం జరిగిన భేటీతో జీవోఎం సమావేశాలు ముగిసినట్లేనని హోం శాఖ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, ఆర్థిక ప్యాకేజీలు, నదీ జలాలు, ఉద్యోగుల పంపిణీ, 371 (డి) వంటి పలు కీలక అంశాలపై మరింత స్పష్టత తీసుకునేందుకే ఆయా శాఖల కార్యదర్శులతో మరోమారు సమావేశమైనట్లు వెల్లడించాయి. ఈ భేటీతో ఆయా అంశాలపై స్పష్టత వచ్చిందని, నివేదిక కూడా దాదాపుగా ఖరారైనట్లేనని తెలిపాయి.