Karnataka unlock: ఆంక్షలు మరింత: కాలేజీలు, మల్టీప్లెక్సులు, సినిమా హాళ్లపై కీలక నిర్ణయం
బెంగళూరు: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పరిమితంగానే ఉంటోంది. మరణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ధాటికి కుదేల్ అయిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. లక్షల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి వేలాదిమంది మరణించారు. ఒకదశలో అన్ని మెట్రో నగరాల కంటే బెంగళూరులోనే కరోనా మరణాలు అత్యధికంగా నమోదైన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు.
Recommended Video
అసదుద్దీన్ ఒవైసీకి షాకిచ్చిన హ్యాకర్లు: ఆయన ఫొటో.. పేరు స్థానంలో
మరో అన్లాక్..
సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లో కొనసాగడం వల్ల కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే దేవస్థానాలను పునరుద్ధరించింది కర్ణాటక ప్రభుత్వం. ధర్మస్థల శ్రీమంజునాథ స్వామి ఆలయం, కుక్కె సుబ్రహ్మణ్య, ఉడుపి, శృంగేరీ శారదాపీఠం, మురుడేశ్వర, కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయం వంటి దేవస్థానాలను పునరుద్ధరించింది. భక్తుల ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక పూజలు, సేవలపై నిషేధాన్ని కొనసాగిస్తూనే.. భక్తులకు దర్శనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అక్కడ నివసించే వెసలుబాటును కల్పించలేదు. దేవస్థానాల ఆధీనంలో ఉండే గదులను ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది.
ఈ సారి మల్టీప్లెక్సులకు ఛాన్స్..
ఇక తాజాగా- మరోసారి అన్లాక్ ప్రక్రియను ప్రకటించింది. ఈ సారి సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, ఆడిటోరియాలను పునరుద్ధరించింది. భౌతిక దూరాన్ని అనుసరించాల్సి ఉన్నందున.. 50 శాతం సీట్లు మాత్రమే భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. సోమవారం నుంచి మల్టీ ప్లెక్సులు, సినిమా హాళ్లు తెరచుకోనున్నాయి. ప్రతి థియేటర్ యాజమాన్యం కూడా తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్స్ను అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది. 50 శాతానికి మించి ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన సినిమా హాళ్లు, థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.
26 నుంచి కాలేజీలు..
మరో విడతలో ఉన్నత విద్యాసంస్థలను కూడా తెరవడానికి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థలు, కళాశాలలు, యూనివర్శిటీలను పునరుద్ధరించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థులు గానీ, యూనివర్శిటీలు/కళాశాలల సిబ్బంది, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ అయినా తీసుకుని ఉండాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే కళాశాలల్లో అనుమతి ఇవ్వాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.
నైట్ కర్ఫ్యూ కొనసాగింపు..
అదే సమయంలో రాత్రివేళ అమలు చేస్తోన్న కర్ఫ్యూను మాత్రం మరికొంతకాలం పొడిగిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతోంది. దీన్ని మరింత కొంతకాలం పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రివేళ్లలో వాహన రద్దీ, జన సంచారాన్ని నియంత్రించడంలో భాగంగా నైట్ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపింది. కేరళలో కరోనా వైరస్ తీవ్రత ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల ఆ రాష్ట్రంలో సరిహద్దులను పంచుకుంటోన్న జిల్లాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.