TRS: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: వెనక్కి తీసుకోండి: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు..!
Recommended Video
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోన్న పౌరసత్వ సరవణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర సమితి తన వైఖరిని తేల్చేసింది. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే కేశవరావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాము బిల్లుకు వ్యతిరేకమని చెప్పారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన వేళ..బుధవారం రాజ్యసభ సమక్షానికి వచ్చింది.

వ్యతిరేకిస్తున్నాం..
దీనిపై చర్చ సందర్భంగా కేశవరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ కు లౌకికవాద దేశమనే పేరు ఉందని, దాన్ని చెరిపేసేలా ఈ బిల్లు ఉందని అన్నారు. భారత మూలాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించిందని చెప్పారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని రావడం.. ఒక రకంగా ముస్లింలను వేరు చేసి చూసినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు.

వెనక్కి తీసుకోండి..
భారతదేశ సిద్ధాంతాలకు పూర్తి భిన్నంగా ఉన్న ఇలాంటి బిల్లుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కేశవరావు చెప్పారు. దేశాన్ని ముస్లింల రహితంగా మార్చాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించినట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. భిన్నత్వంలోనే ఏకత్వం అనే భారత మూల సిద్ధాంతాలను తుడిచి పెట్టేలా కనిపిస్తోందని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రాన్ని ఢీ కొట్టినట్టే..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి ఢీ కొట్టినట్టే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. టీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అంతకుముందే- జీఎస్టీ వసూళ్లలో వాటా కోసం టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఉద్యమించడం, అదే సమయంలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడం వంటి చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వంపై తన వైఖరిని ఏమిటనే విషయంపై టీఆర్ఎస్ కుండబద్దలు కొట్టినట్టయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications